ఎవరికి తెలియని కథలివిలే? (“చందనపు బొమ్మ” – సమీక్ష)

పప్పు అరుణ రాసిన కథల సంకలనం “చందనపు బొమ్మ” పై గ్రేట్ ఆంధ్రా. కామ్ వారి సమీక్ష నుంచి… కొన్ని భాగాలు.

* * *

మన చుట్టూ చాలా సమాంతర ప్రపంచాలు ఉంటాయి. వాటిలోకి మనం తొంగి చూస్తే అనేక ఆశ్చర్యకరమైన విషయాలు కనిపిస్తాయి. మన చుట్టూ ప్రతి రోజు కనిపించే మనుషుల్లోనే కొత్త కోణాలు ఆవిష్కృతమవుతాయి. అలాంటి కోణాలను స్పృశిస్తూ వెలువడిన ఒక కథాసంకలనమే ‘చందనపు బొమ్మ’.

ఈ మధ్యకాలంలో తెలుగుకథలలో పూర్తిస్థాయి తెలుగువాడుక తగ్గుతూ వస్తోంది. తెలుగులో పదాలున్న భావాలకు కూడా ఇంగ్లీషు పదాలను ఉపయోగించడం సామాన్యమైపోయింది. ఈ కథలలో స్వచ్ఛమైన తెలుగు కనిపిస్తుంది.

మంచి తెలుగు కథలు కావాలనుకొనేవారు చదవాల్సిన సంకలనమిది.

సమీక్ష పూర్తి పాఠానికి ఇక్కడ నొక్కండి.

* * *

“చందనపు బొమ్మ” డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది. కినిగె వెబ్ సైట్ ద్వారా ఆర్డర్ చేసి ప్రింట్ పుస్తకాన్ని తగ్గింపు ధరకి పొందవచ్చు. మరిన్ని వివరాలకు ఈ క్రింది లింక్‌ని అనుసరించండి.
చందనపు బొమ్మ On Kinige

Related Posts:

సజీవన చిత్రణ (జీవన శిల్పం సమీక్ష)

రచయిత్రి కన్నెగంటి అనసూయ జీవన శిల్పం బాగా పట్టుకున్నారు. అందుకే ఆవిడ కథానికల్లో శిల్పం, శైలి అంటూ ప్రాకులాడక మానవ జీవన సంవేదనలకు ఆలోచనాత్మకమైన అక్షరాకృతి నివ్వడమే ప్రధానంగా రచన చేసారు. జీవితాన్ని జీవించడం తప్ప నటించడం సరికాదని ప్రగాఢంగా విశ్వసించిన కలం తనది. కథలు కథలకోసమే కాదు సాటివారి జీవన వ్యధలు సాధ్యమైనంత మేరకు తీర్చగలిగే సేవా దృక్పథానికి ప్రోది కావాలన్న సంకల్పం గల రచయిత్రి కనుకనే మానవ స్వచ్ఛంద సేవా సంస్థ స్థాపించి తన రచనలే కాక మాటలూ, చేతలూ కూడా సాటివారి సహకారంతో తదనుగుణంగా నిర్వర్తిస్తున్న సేవాపరాయణ అనసూయ. అమ్మగారి స్ఫూర్తితోనే కమ్మని కథలు రాయడం అలవడిందంటారు.

ఇరవై కథల ఈ సంకలనంలోని కథలన్నీ అనురాగాలకు, ఆర్ద్రతలకు, మానవీయతకూ అద్దం పట్టేవిగా ఉన్నాయి.

‘బియ్యపు రవ్వ ఉప్మా’ అనే కథలో అమ్మ ఆప్యాయతకే కాదు, మాతృభూమి మమకారానికీ ‘ఉపమ’గా వృద్ధాప్యపు రాజారావు జ్ఞాపకాల మనుగడను మనోజ్ఞంగా చిత్రించారు. మనసుకు మనసు పరంబగునప్పుడు కంటికి నీరు ఆదేశంబగునని చాటుతూ రాసిన చిన్న కథే అయినా ‘ఏ సంధి’ అంతరంగపు సందులోకి చొరబడకుండా వుండదు. పినతల్లే తల్లిగా పసివాడి వసివాడని విశ్వాసాన్ని కథనం చేసిన తీరు బాగుంది.

మోసం, వంచన అనే వాటికి ‘జెండర్’ అంటూ ఏమీ లేదు. మోసం చేయడానికైనా, మోసపోవడానికైనా. రచయిత్రి తాను స్ర్తి అయివుండీ కొందరు సంఘంలో స్ర్తిలే ఎలాంటి వంచనలు చేస్తుంటారో ‘రెండొందలు’ కథలో చిత్రించారు. అంతేకాదు మహిళా సంఘాలు, ఉమెన్ ప్రొటెక్షన్ సెల్‌ల వంటివి కూడా అలాంటి వారిని వెనకేసుకు రాకూడదని ధ్వనింపచేసారు.

‘పడమటి సంధ్యారాగం’ అనే కథ పేరు ఆ కథకి ఎలా నప్పిందో తెలియదుగానీ, సాహిత్యాభిలాష ఉన్న ఓ పంజాబీ సైకియాట్రిస్ట్ రైల్వే స్టేషన్‌లో పిచ్చిదానిగా పుస్తకాల మూటతో నలుగురితో చీత్కరింపబడుతూ కనబడే విషాద సంఘటనను కథగా చిత్రించారు. కానీ ఆవిడ అలా మారడానికి గల కారణం కథలో ఎక్కడా చిత్రించబడలేదు. అంత విద్యాధికురాలు పిచ్చిదవడానికి గల హేతువు వివరించకుండా చెప్పడంవల్ల ఆ పాత్రమీద సానుభూతికి సాంద్రత గాఢత సమకూడినట్టు తోచదు.

వయోజన విద్య గూర్చిన అక్షర దీక్షా చైతన్యాన్ని ‘చైతన్యం’ వంటి కథలో చూపించి ప్రభుత్వ పథకాలని త్రోసిరాజనక ప్రజాప్రయోజన అంశాలు అందరూ అందిపుచ్చుకుని ప్రచులితం కావించవలసినవేనని అనిపించారు.

‘‘ఒక్క చిరునవ్వుతో సగం రోగాన్ని డాక్టరు నయం చెయ్యగలడు. మిగతా సగం రోగానికే డాక్టరు మందిచ్చేది. ఆ ఒక్క చిరునవ్వు ఆ రోగిలో ఎంత ఆత్మవిశ్వాసాన్ని నింపుతుందో అంతే నమ్మకాన్ని డాక్టరుపట్ల పెంచుతుంది’’
‘‘మాటలూ భావాలూ ఏమీ లేని మొక్క కూడా ఒక చోట పీకి ఇంకోచోట వేస్తే మట్టీనీరూ రెండూ ఉన్నా, సరిగ్గా నిలబడడానికి వారం పైనే పడుతుంది. తర్వాత ఏ ఆటంకం లేకుండా అది ఎదుగుతూనే ఉంటుంది. ఇక మనుష్యుల సంగతి వేర్వేరు చోట్ల పెరిగొచ్చిన ఇరువురు వ్యక్తుల అభిప్రాయాలు కలవటానికి, ఒకరినొకరు అర్ధం చేసుకోవడానికి వారం, నెల లేదా సంవత్సరం పట్టవచ్చు. అచ్చంగా మట్టిలో బతకడానికి ప్రయత్నించే మొక్కలు. కాకపోతే ఈలోపు కాస్త ఆవేశాన్ని అదుపులో ఉంచుకోగలగాలి అంతే!’’
రెండు విభిన్న పాత్రల ద్వారా ఈ సందేశాలను సంకలించిన కథ ‘చిరునవ్వు’. అదృష్టం మనతోనే మనని వెన్నంటి ఉంటుందట. మనం కష్టపడితే అదృష్టమూ కష్టపడుతుందట. మనం నిద్రపోతే అదీ నిద్రపోతుందట అన్న అంశంతో చిత్రించిన కథ ప్రోత్సాహం.

అనసూయ కథల నిండా ఇలా జీవన సారస్యాన్ని వివరించే మంచి పంక్తులు సంభాషణలుగా, వ్యాఖ్యానాలుగా ఔచిత్యంతో తొణికిసలాడుతుంటాయి. అందుకే జీవన శిల్పం అంటే ఉదాత్త ఆశయాల విలవల శిల్పీకరణమే అనిపింపచేస్తారు. చదివించే మంచి శైలి అలవాటే ఈ యలమాటి పుట్టింటి పడతికి. కన్నెగంటి అనసూయగారి వెన్నవంటి మృదుభావాల మానవీయ కథానికల సంపుటి ‘జీవన శిల్పం’.

అల్లంరాజు
ఆంధ్రభూమి దినపత్రిక, 28/10/2012

* * *

“జీవన శిల్పం” డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది. మరిన్ని వివరాలకు ఈ క్రింది లింక్‌ని అనుసరించండి.

జీవన శిల్పం On Kinige

Related Posts:

ఎన్నారై కథలు

కినిగెలో ఉన్న ప్రవాసాంధ్ర రచయితల కథల సంక్షిప్త పరిచయం ఈ వ్యాసం.

ఎన్నెమ్మ కథలు:
చాలా కాలం క్రితమే అమెరికాలో స్థిరపడిపడిపోయిన రచయిత్రి నిడదవోలు మాలతి కథల సంకలనం ఇది. ఎన్నెమ్మ కథలు అనేవి నిడదవోలు మాలతి గారు తన బ్లాగులో ’ఊసుపోక’ అనే శీర్షికతో రాసుకున్న టపాల సంకలనం. పత్రికలలో ప్రచురించాలి అంటే అది కథో, వ్యాసమో, కవితో, ఫీచరో అయి ఉండాలి. ఇలాంటి వర్గీకరణ చట్రాలలో ఇమడవు ఈ ఎన్నెమ్మ కథలు. ఎన్నో చెణుకులు, చురకలు, చమక్కులు ఉన్న వ్యాసాలు ఈ పుస్తకంలో ఉన్నాయి.
ఎన్నెమ్మ కథలు On Kinige

శ్యామ్‌యానా:
మెడికో శ్యామ్‌గా సుప్రసిద్ధులైన డా. చిర్రావూరి శ్యామ్ రాసిన కథల సంకలనం ఇది. రచయిత మెడికో అయినప్పటికీ, ఈ సంకలనంలో వైద్యం, ఆసుపత్రి, రోగుల నేపధ్యంలో అల్లిన కథలు తక్కువే. ఈ కథలను రచయిత 1971/72 నుంచి 1979 మధ్యలోనూ, ఐ.సి.సి.యు అనే కథని 1981-82 మధ్యకాలంలోను రాసారు. వీటిని ఓ సంకలనంగా తెచ్చే ప్రయత్నం 2010 నాటికి సాధ్యమైంది. ఈ కథా సంకలనాన్ని జులై 2010లో వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా వారు ప్రచురించారు. మంచి కథలున్న ఈ శ్యామ్‌యానా హాయిగా చదివిస్తుంది.
శ్యామ్‌యానా On Kinige

రంగుటద్దాల కిటికీ:
బ్లాగ్ ప్రపంచంలో కొత్తపాళీగా ప్రసిద్ధులైన ఎస్. నారాయణ స్వామి గారి కథాసంకలనం ఇది.
అమెరికా అవడానికి లేండ్ ఆఫ్ మిల్క్ అండ్ హనీ అయితే అవచ్చు కాని, అమెరికాలో జీవితం పూలబాట కాదు. అలాగని భరించలేనిదీ కాదు. సాధారణంగా అమెరికాకి సంబంధించిన తెలుగు కథల్లో కనబడే ఆహార భాషా వ్యవహార భేదాల చర్చని అధిగమించి, వలసవచ్చిన తెలుగు మనుషులు ఈ అమెరికా సమాజంలో అంతర్భాగమయ్యే ప్రయత్నంలోని అనుభవాలని కొంచెం లోతుగా, మరికొంచెం విశాలంగా పరిశీలిస్తూ – కొన్ని సరదా కథలు, కొన్ని ఆలోచింపచేసే కథలు, మరి కొన్ని సులభంగా మరిచిపోలేని కథలు, చక్కని భాష, కథకి తగిన కథన శిల్ప వైవిధ్యం – అన్నీ కలిసి రంగుటద్దాల కిటికీ.
రంగుటద్దాల కిటికీ On Kinige

సరిహద్దు:
గొర్తి సాయి బ్రహ్మానందం గారి రచన “సరిహద్దు”. అన్ని చక్కని కథలైనా, పుస్తకం శీర్షిక అయిన సరిహద్దు కథ అద్భుతంగా ఉంటుంది. మెక్సికో సరిహద్దు దాటి చట్టవిరుద్ధంగా అమెరికాలో ప్రవేశించిన హేవియర్ అనే ఓ వ్యక్తి కథ ఇది. స్వదేశంలో ఇంటి దగ్గర చిన్నచిన్న పనులైనా చేసి ఎరుగని వ్యక్తి అమెరికాలో జానిటర్‌గా పనిచేస్తాడు. అమెరికన్లు తలచుకుంటే ఇల్లీగల్‌గా దేశంలో ఉంటున్న వారిని ఏరేయడం పెద్ద కష్టం కాదు, కానీ మరెందుకు అలా చేయడం లేదు? దాని వెనుక ఉన్న చీకటి కోణం ఏమిటి? ఈ అమెరికా అన్నది ఓ మాయాజాలమని, వయసులో ఉన్న కుర్రాడు అందమైన అమ్మాయి మోహంలో పడ్డట్టు అందరూ ఈ దేశపు మాయలో పడిపోతారంటాడు హేవియర్. మనసు భారమైపోతుందీ కథ చదివాకా.
సరిహద్దు On Kinige

ఉరి:
బ్లాగర్ శరత్ నాగం రచించిన నవల ఇది. ఇది ఒక మనో వైజ్ఞానిక నవల మరియు మానసిక విశ్లేషణాత్మక నవల. మానసిక మాంద్యంతో, అలజడితో వ్యక్తులు ఎలా యాతన అనుభవిస్తారో, తమకు సరిపడని బాహ్య ప్రపంచంతో ఎంత సంఘర్షణ అనుభవిస్తారో ఒక చక్కని థ్రిల్లర్ రూపేణా ఉత్సుకత కలిగిస్తూ చెప్పడం జరిగింది. ఇది చదవడం వలన మనోరుగ్మతల గురించి మంచి అవగాహన రాగలదు. ఓ రకంగా ఇది రచయిత ఆత్మకథగా అనుకోవచ్చు.
ఉరి On Kinige

మూడోముద్రణ:
కన్నెగంటి చంద్ర రాసిన 22 కథల సంకలనం ఇది. అన్నీ కథలు బావున్నా, “సిగ్గు కథ” గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాలి. చిన్న పాప నుంచి, పెళ్ళయి శ్రీమతిగా మారేవరకు ఆడపిల్లల జీవితం ఎలా సాగుతుందో ఈ కథ చక్కగా చెబుతుంది. తలను నేలకు తాకేదాకే వంచగలిగే స్థితికి స్త్రీలు ఎందుకు చేరుతారో ఈ కథ చెబుతుంది. ఓ మహిళ అచ్చమైన ఆడదిగా ఎలా మారిపోతుందో చెబుతుందీ కథ. మిగతా కథలూ తక్కువేం కాదు.
మూడోముద్రణ On Kinige

* * *

విభిన్న సమాజాల కథలను భిన్న దృక్పథాల నుంచి చదవడం గొప్ప అనుభూతి. వీటిని హాయిగా ఆస్వాదించవచ్చు.

కొల్లూరి సోమ శంకర్

Related Posts:

మనిషికి ఉండాల్సిన ‘ మెలకువ’

ప్రముఖ కథా రచయిత్రిగా పి. సత్యవతి తెలుగు పాఠకులకు, సాహితీప్రియులకు సుపరిచితులు. ఆమె రచించిన ఓ పద్నాలుగు కథలే ఈ ‘మెలకువ‘. కథలన్నీ చిన్నవే అయినా వాటిల్లోని సారం గొప్పది. చిన్న సంఘటనల వెనుక దాగి ఉండే పెద్ద నిజాలు, సాధారణమైనవిగా వినిపించే సంభాషణల వెనుక పొంచి ఉండే మానవ ప్రవృత్తులూ ఈ కథల్లో దర్శనమిస్తాయి. వీటిల్లో ఎదురయ్యే మనుషుల్లో ఎక్కువ మంది- భూమి నుండి, గ్రామీణ పరిసరాల నుండి దూరమైన మొదటి లేదా రెండో తరం నగర జీవులు. త్వరితగతిన యాంత్రికమూ, సంక్లిష్ట భరితమూ, అమానుషమూ అవుతున్న నగర జీవనపు బాధితులు. అయితే ప్రధాన పాత్రలన్నీ కూడా తమ చుట్టూ పరుచుకున్న వలయాలని ఛేదించి ముందుకి సాగిన స్త్రీలవి. “జీవితం ఒక అనుదిన చర్యగా, స్వయంచరితంగా మారబోయే ప్రమాదఘంటికలు మోగబోయినప్పుడు చప్పున వాటిని సృజనతో ఆపాలి” అని సత్యవతిగారే స్వయంగా పేర్కొన్నారు. అందుచేత ఈ కథలన్నీ జీవితానికి బాగా దగ్గరగా, విశాలమైన సృజనాత్మక వనంలో సంచరిస్తాయి.

ఆస్తి పంపకాలు వెల్లడించే వాస్తవాలు (‘భాగం’), ఏం చేసినా (నోరున్న) ఆడవాళ్ళే చెయ్యాలనే నిజం (‘భారవాహిక’), ఇంట్లోని పరిస్థితుల్ని చక్కదిద్దుకోవాలంటే బయటకుపోయి గౌరవంగా పనిచేసుకోవాలనే స్త్రీల అవగాహన (‘కాడి’), మారుతున్న పరిస్థితుల్లో స్త్రీ పురుష సంబంధాల్ని పునర్నిర్మించుకోవాల్సిన అవసరం (‘ఆవిడ’), అర్థవంతమైన జీవితాన్ని, కనీసం అమెరికా ఆశయాన్నయినా సమర్థవంతంగా చేరుకోగల సామర్థ్యం, నైపుణ్యం కల్పించని నేటి చదువులు (‘ఒక రాణి – ఒక రాజా’)… ఇలాగే మరెన్నో కోణాలు. ఇక తలమానికమైన ‘మెలకువ’ కథలో- ఎన్నో సంవత్సరాలపాటు సాగిన సహవాసంలో, కాపురంలో ఏర్పడే మాటలకు అందని, మాటలు అక్కర్లేని పరస్పర అవగాహన, సమతుల్యాల్ని సున్నితంగా, హాస్యభరితంగా చిత్రీకరిస్తూనే- ‘పల్చని గాజుగోడలు’ పొరలుగా ఏర్పడకుండా ఉండాలంటే, జీవితాన్ని ఆస్వాదించాలంటే- నిత్యం మేల్కొని ఉండాలనే గంభీరమైన విజ్ఞతను కలగజేస్తారు రచయిత్రి. మనం అనవసరంగా వాడే కొన్ని ఇంగ్లీషు మాటల్ని చక్కని తెలుగులో ఎలా చెప్పుకోవచ్చో సత్యవతిగారు సూచిస్తారు : ‘చెక్క మొహం’, ‘చదివే కళ్ళజోడు’, ‘పిలిచే గంట’- ఇలాంటి పద ప్రయోగాల్లో.

చిన్న మాటల్లోనే పెద్ద విషయాలు చెప్పవచ్చనీ, వస్తువే శైలిని నిర్దేశిస్తుందనీ (‘ఆత్మలు వాలిన చెట్టు’, ‘నేనొస్తున్నాను..’) జీవితంలో ఏదీ కూడా పైకి కనిపించేటంత సరళంగా ఉండదనీ, స్వేచ్ఛ, ఆత్మగౌరవం కావాలంటే సంఘర్షణ తప్పదనీ ఈ కథలు మనకు తెలియజేస్తాయి. కథలన్నీ సెలయేరుల్లా గలగలా సాగిపోయినా వాటిల్లో నిశ్శబ్ద గంగానదీ ప్రవాహం లాంటి గాంభీర్యం ఏదో దాగి ఉన్నదనిపిస్తుంది. ఇందుకు కారణం బహుశా తీర్పు చెప్పే ధోరణిలో కాకుండా ఔదార్యం, కారుణ్యభావంతో, మనుషులంటే గౌరవంతో రచయిత్రి ఈ కథల్ని సృష్టించినందువలన కావచ్చు. జీవితాన్ని, తెలుగు భాషని, సాహిత్యాన్ని ప్రేమించేవాళ్ళు మాత్రమే కాక కొత్త గా రాస్తున్న వాళ్ళు, రాయాలని ఉత్సాహపడేవాళ్ళు కూడా సత్యవతిగారి ఈ కథల నుండి చాలా తెలుసుకోవచ్చు, నేర్చుకోవచ్చు. ముందుమాటలో శివారెడ్డిగారన్నట్టు ‘జడప్రాయ యాంత్రిక రచనా విధానాన్నించి రక్షించేది అధ్యయన అన్వయా లే”. ఇవి రెండూ ఈ కథల్లో మెండుగా కనిపిస్తాయి.

ఉణుదుర్తి సుధాకర్ (ఆదివారం ఆంధ్రజ్యోతి, 2 సెప్టెంబర్ 2012)

* * *

“మెలకువ” డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది. మరిన్ని వివరాలకు ఈ క్రింది లింక్ చూడండి.
మెలకువ On Kinige

Related Posts:

చదవాల్సిన పుస్తకం: మనీప్లాంట్

ఇతర భాషా కథల్ని తెలుగువారికి పరిచయం చేస్తున్న రచయితల్లో ముందువరుసలోని కథకుడు – కొల్లూరి సోమ శంకర్. సోమ శంకర్ అనువాద కథల సంపుటి – ‘మనీప్లాంట్‘.
కొన్ని ప్రత్యేకతలని సంతరించుకుని, ఒక విలక్షణ గ్రంథంగా మనముందుకొచ్చింది – ఈ ‘మనీప్లాంట్’.

ఈ పుస్తకానికి “వికసించిన అనువాద సృజన” అని గుడిపాటి ముందుమాట ఉంది. పుస్తకంలోని ప్రత్యేకతల్లో మొదటిది ఈ ముందుమాట.

తెలుగులో చక్కని వచనం రాయటం చక్కని కవిత్వం రాయటం కంటే కష్టం. ‘శైలి రచయిత వ్యక్తిత్వం’ అంటారు. కొంతమంది శైలి బాగా incisive గా వుంటుంది. అతి తక్కువ అక్షరాల పదాలు, అతి తక్కువ పదాల వాక్యాలు, భావం వాటి వెంట పరిగెత్తుతుంది. ప్రతిపాదిస్తున్న అంశం మళ్ళీ గాఢంగా అందుతూ వుంటుంది పఠితకి.
ఇంతటి శక్తివంతమైన శైలి తెలుగు రచయితల్లో చాలా తక్కువ మందిలో చూస్తాము.

గుడిపాటి అభిప్రాయభాగాన్ని ఉదహరిస్తున్నాను. చూడండి. “జీవితం అందరికీ ఒకేలా ఉండదు. మనుషులు తార్కికంగా, హేతుబద్ధంగా ప్రవర్తించరు. సహేతుకంగా ఉండాలని ఆశించడం తప్పుకాదు. కానీ ఉండలేకపోవడమే జీవిత వాస్తవం. తమలా ఎదుటివారు ఆలోచించాలని, నడుచుకోవాలని మనుషులు ఆశిస్తూంటారు. కానీ అలా ఎవరూ ఉండలేరు. నిజానికి తాము ఎలా ఉండాలనుకుంటున్నారో అలా కూడా ఉండలేరు. కారణాలేమయినా, మనుషుల్ని ఉద్వేగాలే నడిపిస్తాయి. అందుకే ఒక తీవ్రతలోంచి మరో తీవ్రతలోకి ప్రయాణిస్తారు. ఈ మనిషి చచ్చిపోతే బాగుండును అనుకున్న మనిషి పట్లనే అవాజ్యమైన ప్రేమ కలుగుతుంది. అదెలా సాధ్యమనే ప్రశ్నకు హేతువు సమాధానం చెప్పదు. జీవితమే దాని సరైన జవాబు. ఇలాంటి జీవిత సత్యాన్ని చెప్పే కథలు ఈ పుస్తకంలో ఉన్నాయి”.

భావాస్పదమైన పదాల పోహళింపు, భావ విపులీకరణ – రెండూ అద్భుతంగా నిర్వహించబడిన రచనా పరిచ్ఛేదం ఇది.

ఇక, గుడిపాటి వ్యక్తం చేసిన జీవన తాత్వికతకి వస్తే – ఇది పూర్తిగా భౌతిక వాస్తవికత పునాదిగా కల్గిన అవగాహన. మనిషి బహిరంతర వర్తన, ఆలోచన – వీటికి గల పరిమితి, వీటి మీద external and internal forces ప్రభావాలు – అన్నీ సద్యస్ఫూర్తితో ఆకళించుకుని చెప్పిన ఒక గొప్ప అభిప్రాయంగా అంగీకరిస్తాము దీన్ని.
జీవితం పట్ల ఒక తాత్విక వివేచనని సముపార్జించుకోకుండా, అధ్యయన రాహిత్యంతో కథల్ని పునాదులు లేని మేడలుగా నిర్మించబూనడం – ఆరుద్ర అన్నట్లు ‘బంతి లేకుండా ఫుట్‌బాల్ ఆడడం’ వంటిది. జీవితం, జీవన విధానం, గతి – సరళరేఖ కాదు. దీన్ని గమనించకుండా, ప్రతీ సంఘటనకీ, కథలోని ప్రతీ పాత్రకీ కార్యకారణ సంబంధాల్ని అంటగట్టాలని కృతకమైన రీతికి తలపడడం – కథౌచిత్యాన్ని దెబ్బతీస్తుంది.

గుడిపాటి వ్యక్తం చేసిన అభిప్రాయాలతో ఏకీభవించేవారు – అటు పాఠకుల్లోనూ, ఇటు కథకుల్లోనూ అధిక సంఖ్యలో ఉన్నారు. అయితే ఈ అంశాన్ని ఇప్పుడు గుడిపాటి చెప్పినంత స్ఫుటంగా, ఇంత సరళంగా, ఇంత శక్తివంతంగా – తెలుగు కథా సాహిత్యంలో ఎవరూ చెప్పలేదు. గుడిపాటి చెప్పిన ఈ అంశాన్ని కొత్తకథకులు అర్థం చేసుకోవాల్సిన అవసరం వుంది.

‘మనీప్లాంట్’ పుస్తకంలోని Contents విషయానికి సంబంధించి కూడా కొన్ని ప్రత్యేకతలని చూద్దాం. ‘పట్టించుకోని వాళ్ళయినా వాస్తవాలని ఎదుర్కోక తప్పదు’ అంటాడు ఆల్డస్ హక్స్‌లీ. మనకు బాగా దూరంగా నివసించే ప్రజల గురించీ, వారి జీవన విధానాన్ని గురించీ, స్థితిగతులను గురించీ మనం ఎక్కువగా పట్టించుకోము. కానీ, అవే మనకూ తారసపడవచ్చు. మనమూ వాటిని ఎదుర్కోవలసి రావచ్చు. కనుక, ఆయా స్థితిగతుల్ని మనమ్ ముందుగానే పరిచయం చేసుకొని వుంటే, నిజజీవితంలో ఆయా సంభవాలు ఎదురయితే, వాటిని ఎదుర్కోడం సుళువవుతుంది. అంటే మానసికంగా తయారై వుండటమన్న మాట. ఇతర భాషాసాహిత్య పఠనం ఇందుకు బాగా వుపయోగపడుతుంది. అందునా కథలు – వివిధ జీవన పార్శ్వాల మెరుపుల్నీ, మరకల్నీ, మనకు గాఢతతో అందించగలవు; మన ఆలోచనల విస్తృతికి దోహదం చేయగలవు. ఇదీ అనువాద కథల ప్రయోజనం.

ఈ పుస్తకానికి “అనువాద ‘కథం’బం” ముందుమాట కూర్చిన కె. బి. లక్ష్మి ఇదే విషయాన్ని ఇలా చెప్తున్నారు, “స్నేహాలు, రాగద్వేషాలు, ఈర్ష్యాసుయలు, కలిమిలేములు, కష్టసుఖాలు, వినోద విలాసాలు – వగైరాలు విశ్వమానవులందరికీ సమానమే. ఏ భాష వారు ఆ భాషలో ఘోషిస్తారు”. కనుక, ఆ ఘోషల మూలాల్ని అర్థం చేసుకోడానికి ఈ కథలు తోడ్పడుతాయి.

‘మనీప్లాంట్’ లోని మరో ప్రత్యేకత ఇందులోని కథలన్నీ – వర్తమాన సమాజ జీవన దృశ్యాల సమాహారం. ఎంతో నేర్పుతో – ‘ఈనాటి’ జీవితాల్నీ, వ్యక్తిగత ధోరణుల్నీ, సాంఘికంగా సంక్లిష్టతలని కల్పిస్తున్న రీతి రివాజుల్నీ – ఈ కథల్లో దర్శింపజేసాడు, సోమ శంకర్. కథల్ ఎన్నిక – ఆ విధంగా ఎంతో చాకచక్యంగా నిర్వహించాడు.
“లుకేమియా”తో బాధపడుతున్న క్లాస్‌మేట్ గుండుకు తోడు సహానుభూతితో తానూ గుండు చేయించుకున్న చిన్నపిల్ల సింధు కథ ‘పెరుగన్నం’తో మొదలుపెట్టి, శూన్యభట్టాచార్య పేరుతోనే సున్నాగాడుగా స్థిరపడి – జీరోగా గేలిచేయబడిన ‘శూన్య’ చివరికి గురువుగారి సాంత్వనలో “నేనంటే నాకెంతో గర్వంగా ఉందీ రోజు” అనుకునే స్థితికి ఎదిగిన “సున్నాగాడు” వరకూ – ఒక్కొక్క కథ ఒక్కొక్క మణిపూస.

మారిస్ బౌడిన్ జూనియర్ అనే రచయిత – కథకునికి ఆవశ్యకమైన విశిష్ట దృక్పథాన్ని గురించి రాస్తాడు ఒకచోట. అనువాద కథనే రాస్తున్నా – సోమ శంకర్‌లో ఈ విశిష్ట దృక్పథం ప్రస్ఫుటంగా కనిపిస్తోంది.

మూల కథలోని వాతావరణాన్నీ, పరిసరాలని అవగతం చేసుకుని, మూల కథా రచయిత కంఠస్వరాన్ని గుర్తెరిగి, ఆ భాషాసౌందర్యానికి భంగం కలగకుండా, నుడికారాన్ని చెడగొట్టకుండా – అనువాదం నిర్వహించారు సోమ శంకర్.

కథకుని లక్ష్యశుద్ధీ, చిత్తశుద్ధీ – పుష్కలంగా ద్యోతకమవుతున్న గొప్ప కథా సంపుటి ‘మనీప్లాంట్’. అందుకే ఇది కొని చదివి దాచుకోవాల్సిన పుస్తకం.

విహారి (చినుకు మాసపత్రిక, ఆగస్టు 2008 సంచిక నుంచి)

* * *

“మనీప్లాంట్” డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది. మనీప్లాంట్ పుస్తకాన్ని కినిగె వెబ్‌సైట్ ద్వారా ఆర్డర్ చేసి తగ్గింపు ధరకి పొందవచ్చు. మరిన్ని వివరాలకు ఈ క్రింది లింక్ చూడండి.

మనీప్లాంట్ On Kinige

Related Posts:

నిజానికివి వేట కథలు (పర్యావరణ కథలు – సమీక్ష)

ప్రఖ్యాత కన్నడ రచయిత కువెంపుగారి కుమారులైన పూర్ణచంద్ర తేజస్వి అనతికాలంలోనే తన రచనల ద్వారా తండ్రిని మించిన తనయుడిగా పేరుపొందారు. పూర్ణచంద్ర తండ్రి ప్రభావం తనమీద పడకూడదన్నట్లుగా రామమనోహర్ లోహియా, లోక్‌నాయక్ జయప్రకాశ్ నారాయణగార్ల సమాజవాద సిద్ధాంతాల ఆకర్షణకు లోబడి కులాంతర వివాహం చేసుకుని రైతుపోరాటాల్లో ముఖ్యపాత్ర నిర్వహిస్తూ, ఘోరారణ్యం చెంతన పొలం కొని కాఫీ ఎస్టేట్‌గా దాన్ని మలచి ఎక్కువ శాతం తన హాబీలైన ఫోటోగ్రఫీ, పరిసర అధ్యయనం, భూమిపుత్రుల జీవితాలు, సంగీతం, చిత్రలేఖనం, మొదలైన వాటిలో మునిగి వీలు కుదిరినప్పుడు రచనల్ని చేస్తుండేవారు. కాఫీ ఎస్టేట్ వేసేందుకు వచ్చిన రచయిత తుపాకీ భుజం మీద వేసుకుని రోజంతా టామీ అనే కుక్కతో అడవిలో శికారు చేయడం దినచర్యగా మారింది. అలా అక్కడ ఉంటూ అడవితో పొందిన అనుభవాల్ని ఇలా కథల రూపంలో అందించారు.
మలైనాడులోని అడవి, వన్యప్రాణులు, వేట గురించిన ఆసక్తికరమైన విషయాలను ఈ కథల్లో రికార్డు చేశారు. ఇందులో రచయిత అతని వద్ద పనిచేసే ప్యారడు, మారడు, టామీ అనే పెంపుడు కుక్క ప్రధాన పాత్రలుగా ఈ కథనాలు కొనసాగుతాయి.

ఒక రాత్రి అడవిలో మొరుగుతున్న టామీ అరుపులు విని వెళ్ళిన రచయితకు, అది ‘ఉడుం’తో చేస్తున్న పోరాటం కనిపిస్తుంది. ఆ ఉడుంను పట్టుకుని తాడుతో చెట్టుకి కట్టివేస్తే, అది పాక్కుంటూ చిటారు కొమ్మను చేరుకుంటుంది. తాడుతో దాన్ని ముగ్గురు గుంజినా కిందపడదు. దాంతో ఉడుం పట్టు అంతే ఏమిటో తెలిసివస్తుంది. ఈ కథలో ఉడుం జీవన విధానం గురించి, దానికి సంబంధించిన ఎన్నో విశేషాల గురించి సందర్భోచితంగా వివరిస్తారు. “టామీతో ఒకరోజు” కథలో ఇంగ్లీష్ రీడరిఅన మిత్రుడొకరు శ్రీరామ్‌తో కలసి అడవికి వేటకెళ్ళి అడవి పందిని కొట్టుకొచ్చిన విధానాన్ని కళ్ళకు కట్టినట్లుగా చిత్రీకరించారు. అడవి జంతువులు విపత్కర పరిస్థితులలో అసాధారణంగా మసలుకుంటాయనీ వాటి గురించి, వాటి “దెయ్యం కోడి” లో చూడవచ్చు. ప్రతీ వేసవిలో రచయిత ఇంటివద్ద ఎదురయ్యే పాముల నుంచి ఎన్నో నష్టాలను ఎదుర్కొంటారు. ఒక వేసవిలో నాగుపాము సృష్టించిన భయోత్పాతాన్ని, దాన్ని చివరకు ఎలా పట్టుకున్నారో ఆసక్తికరంగా వివరించే కథ “కాళప్పగారి కోబ్రా”. అయిదు గ్రామాలను పీడించే కోతుల సమస్య గురించి చర్చించిన కథ “గాడ్లి”. రామలక్షమ్మగారి తోట మేనేజర్‌గా పనిచేస్తున్న గాడ్లి కోతులను పారద్రోలడానికి పడిన పాట్లను, ఆయన భంగపాటును ఈ కథ వివరిస్తుంది. ఒక్కొక్క వన్యప్రాణికి ఒక్కొక్క రకమైన విచిత్ర రక్షణ తంత్రం ఉంటుంది. కప్పలు, తాబేలు, అడవిపంది అవలంబించిన రక్షణ విధానాలు “చెరువు ఒడ్డున” గమనిస్తున్న రచయిత దృష్టి నుండి తప్పించుకోలేకపోతాయి. దెయ్యాలు ఉన్నాయో లేవో తేల్చడానికి స్మశానికి వెళ్ళివస్తుండగా, చిన్న గజ్జి కుక్కపిల్ల వెంటబడుతుంది. దెయ్యమే ఆ రూపంలో వస్తుందని, దాన్ని వదిలించుకోవాలని ఎంతగా ప్రయత్నించినా అది వెంటబడడాన్ని “మాయామృగం”గా వర్ణిస్తారు. అనేక సందర్భాలలో ప్రాణులు మరియు వృక్షాలకు సంబంధించిన ఎన్నో కథలు నిదానంగా జనం మనస్సుల నుంచి తొలగిపోయినా, అప్పుడప్పుడు వాటి మీద కలిగే ఇష్టాయిష్టాల నుంచి అవి జనం మనసులో అలాగే ఉండిపోతాయి. కొన్నిసార్లు ఏదో కథలోని దృష్టాంతం నిరూపణగా లేకపోయినా, కొన్ని జంతువుల నడవడిక మీద ఏర్పడే దురభిప్రాయాలు అలాగే ఉండిపోతాయని అనేక ఉదాహరణలో వివరించిన కథ “సైతాన్ నుంచి ప్యారడికైన నష్టం”, “సుస్మిత మరియూ చిన్న పక్షిపిల్ల” కథలు పక్షుల ఫోటోలు తీయడం ఎంత కష్టమో, వాటిని సాకడం కూడా అంతే కష్టమని రచయిత తన అనుభవాలతో వివరిస్తారు. “ఔషద తీగ”, ఇదొక విచిత్రమైన మూలికాతీగ కథ. అడవిలోని దట్టమైన పొదలలో కనిపించే ఈ తీగ అవసరమైన వారికి ఓ పట్టాన కనిపించదు. ఈ తీగ గురించి ఉండే అబద్ధాలు, నిజాలు, కల్పనలోని కథలు…. వీటన్నింటి గురించి రచయిత చేసిన సత్యాన్వేషణే ఈ కథగా రూపొందింది.

ఈ కథలన్నీ అడవి – అటవీ సంపద, వన్యమృగాలపై ఆధారపడిన ప్రజల అవసరాలు, అనుభవాలను తెలియజేస్తాయి. రచయిత వీటిని పర్యావరణ కథలన్నారు. కానీ నిజానికివి వేట కథలు. వేటగాడిగా రచయిత అడవిలోని పరిస్థితులు, వన్యప్రాణుల ప్రవర్తనను విశ్లేషిస్తారు. ఆయన చేసిన పరిశీలనలు మనల్ని ఎంతగానో ఆకట్టుకుంటాయి. పనివాళ్ళల్లో, గ్రామాల్లో వున్న మూఢవిశ్వాసాను హేతువాద దృష్టితో నిగ్గుతేల్చి అసలైన సత్యాన్ని తెలుసుకుంటాడు. సంచార జాతుల వాళ్ళయిన “మాస్తి మరియు బైరడు” వేట నైపుణ్యాలను పరికించినప్పుడు, అల్లం శేషగిరిరావు, డిబింగాడు తప్పకుండా జ్ఞాపకం వస్తారు. కన్నడంలో ఈ పుస్తకం 16సార్లు పునర్ముద్రణకు నోచుకుందట. ఈ పర్యావరణ కథలు కర్నాటకలో ప్రాథమిక స్థాయి నుండి ఇంటర్ వరకూ ఆయా తరగతుల భాషానైపుణ్యాలకు అనుగుణంగా పాఠ్యాంశాలుగా పెట్టారు. ప్రముఖ అనువాదకుడు శాఖమూరు రామగోపాల్ శ్రమించి ఉస్మానియా విశ్వవిద్యాలయ గ్రంథాలయంలో నిద్రాణమైన ఈ కథలను సంపాదించి, అనువదించి తెలుగువారికి అందిస్తున్నారు. అనువాదం చాలా బాగుంది.

కె.పి. అశోక్ కుమార్
పాలపిట్ట జులై 2012 సంచిక

* * *

“పర్యావరణ కథలు” డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది. అంతేకాదు, ఈ కథల సంకలనం ప్రింట్ బుక్‌ని ఇప్పుడు కినిగె ద్వారా తగ్గింపు ధరకి తెప్పించుకోవచ్చు. మరిన్ని వివరాలకు ఈ క్రింది లింక్‌ని అనుసరించండి.
పర్యావరణ కథలు On Kinige

Related Posts:

పూర్ణచంద్రతేజస్వి “పరిసర కతెగళు” (పర్యావరణ కథలు) : ఓ పరిచయం

మీ చెప్పులను ఎప్పుడైనా కుక్కలు ఎత్తుకెళ్ళాయా? పల్లెటూళ్ళతో మీకు సంబంధం ఉంటే తప్పనిసరిగా ఈ అనుభవం ఎదురయ్యే వుంటుంది. అయితే వాటి బారిన పడకుండా మీ చెప్పులను రక్షించుకోవాలంటే ఏంచెయ్యాలి? ఎడమ చెప్పు కుడివైపునా , కుడిచెప్పు ఎడమవైపునా ఉంచండి. కుక్కలు వాటివైపు వెళ్ళవు. ఎందుకంటారా? అవి దెయ్యం కాలిజోళ్ళని భయపడతాయి. నమ్మబుద్ధవటంలేదా? పూర్ణచంద్ర తేజస్వి అనే ప్రఖ్యాత కన్నడ రచయిత రాసిన ‘పరిసర కతెగళు’ అన్న కన్నడ కథాసంపుటాన్ని తెలుగుచేసి శాఖమూరి రాంగోపాల్ గారు అందించిన ‘పర్యావరణ కథలు‘ చదవండి. అందులో మరడు ఈ సత్యాన్ని శాస్త్రీయదృష్టిగల తేజస్విగారి ముక్కు పట్టుకుని మరీ చెపుతాడు. ఆయన మన చెవి పట్టుకుని ఆ వైనాన్ని ఓ కథచేసి వినిపిస్తాడు.
ఉడుంపట్టు అనటం వినీ ఉంటారు, అనీ ఉంటారు. ఆ పట్టు ఎలాంటిదో ఎంతటిదో మీరు చూసి ఉండరు. అది కళ్ళకు కట్టినట్టు, మనసుకు ‘ఉడుంపట్టు’ పట్టేటట్టూ చెపుతారు తేజస్వి.
కోతులు వచ్చి ఇళ్లమీదా, దొడ్లమీదా పడి నానాయాగీ చేస్తే మీరేం చేస్తారు? వాటిని చంపెయ్యాలనుకుంటారు. అయితే అవి దైవస్వరూపాలు గదా ఎలా చంపుతాం అంటాడు గాడ్లీ. పాపం ఆ మానవుడు అందుకోసం నానాపాట్లూ పడి ఓ బోను తయారుచేస్తాడు. దానితో వాటిని పట్టుకుని తీసుకువెళ్ళి అడవిలో వదిలెయ్యాలని అతగాడి పథకం. పట్టుకుంటాడు. దైవస్వరూపాలు గదా. అందుకోసం వాటికి తిండి ఏర్పాట్లు చేస్తాడు. తీరా తీసుకువెళ్ళి బోను తెరిస్తే, తిండి మరిగిన ఓ కోతి బయటకు వెళ్ళదు. దానిని బయటకు తరమటానికి తను బోనులోకి వెళ్ళేసరికి పొరపాటున అందులో చిక్కుకుపోతాడు. ఆ గాడ్లీ కథ వింటారా అయితే తేజస్విగారి స్వానుభవాలతో నిండి ఈ ‘పర్యావరణ కథలు’ చదవండి.
పర్యావరణం అన్న పదం తెలుగులో ప్రస్తుతం చెలామణీ ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఈ పదం ఒకటి రెండు దశాబ్దాలుగా వినపడుతోంది. ఈ పదం వ్యక్తంచేసే అంశంలో అనేక ఫిర్యాదులు ఉన్నాయి. వన్యజీవుల అంతర్ధానం, వన్య జీవిత విధ్వంసం అందులో ఒకటి. మన అనుభవజ్ఞులైన ప్రాణుల అంతర్ధానానికి కారణం మానవులమైన మన అత్యాశ. మానవీయ దృష్టితో చూచినా, మన బాగుకోసమే అని గ్రహించినా అవి అంతరించిపోకుండా మనం జాగ్రత్త పడాలి. పౌరులు తమ ప్రభుత్వాలనూ, దేశాలు ధనిక దేశాలనూ ఒత్తిడి చేసి తగు జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నద దీని సారాంశం. వనాలు కొట్టివేసి వానలను తగ్గించి, తద్వారా ఉష్ణోగ్రతలలో మార్పులకు కారణమవుతున్నాం. హానికర రసాయనాల వినియోగంతో మరింత వాతావరణ మార్పులకు దోహదం చేస్తున్నాం. పర్యావరణం అనగానే ఈ అంశాలు, వాదనలూ, వివరణలూ మనలో కదులుతాయి. ఈ పుస్తకం శీర్షిక వాటిని ఎంతోకొంత గుర్తుచేస్తుంది. దీనివల్ల పుస్తకానికి అదనపు అమ్మకపు విలువ చేరుతుందా లేక ఆ దృష్ట్యా చదవాలనుకునే వారికి అసంతృప్తి కలిగిస్తుందా అనేది ప్రశ్నార్థకం.
పోతే- కన్నడిగుల రాష్ట్రకవిగా గౌరవింపబడే కువెంపుగారి కుమారుడు పూర్ణచంద్ర తేజస్వి. 1938లో పుట్టిన వీరు 2007లో కీర్తిశేషులయారు. కవిత్వం, కథ, నవల, నాటకం, యాత్రాసాహిత్యం, అనువాదాలు, విమర్శ, శాస్త్ర -కల్పన (scientific fiction) వంటి అనేక ప్రక్రియలలో సాహిత్య కృషిచేశారు. “అబచూరిన పోస్టాఫీసు” అన్న వీరి కథా సంపుటాన్ని కన్నడ ప్రగతిశీల (progressive) సాహిత్యానికి ఆరంభంగా భావిస్తారు. ఈ పేరుతోనూ, “తబరినకతె” అన్న పేరుతోనూ విడుదలైన సినిమాలు అనేక పురస్కారాలు అందుకున్నాయి. ఈయన చదువు ముగించుకుని లోహియా ప్రభావంతో వ్యవసాయం చేయటానికి పశ్చిమ కనుమలలో తేయాకు తోట కొని వ్యవసాయం చేశారు. అక్కడి అనుభవాలతో తను పరిసరాల ప్రేమికునిగా మారానని, ఆ మారిన విధానాన్ని ఈ కథలలో అర్థంచేసుకోవచ్చని తేజస్వి తన పుస్తకంలోని మొదటి రచనలో ఇలా చెపుతారు. “నేను చెప్పే చిన్నా, చితకా నా స్వంత అనుభవాలలోని సంఘటనలకు, పర్యావరణంకు ఏదో సంబంధాన్ని నేరుగా చూపించలేనండి! అయితే నా బతుకు బాటలో ఇది (ఈ రాతలు) నేను నడచివచ్చిన దారి అని మాత్రం చెప్పగలనండి”. వానలమయమైన పశ్చిమ కనుమలలోని ఓ కుర్రవాని దృష్టినుండి చెప్పిన తొలి కథతోనే రాజ్యోత్సవ పురస్కారం అందుకుని తండ్రి ఛాయనుంచి బయటపడిన తేజస్వి ఈ కథా సంపుటం పదహారు ముద్రణలకు పైగా అమ్ముడుపోయింది “కర్వలు” అనే వారి నవల 26 ఏళ్ళు గడిచినా ప్రతివారం అమ్ముడుపోయే తొలి పది పుస్తకాలలో ఒకటి అంటారు.
ఈ సంపుటంలోని కథలలో పాత్రలు మళ్ళీ మళ్ళీ వస్తుంటాయి. ఇది మనలని పాత్రలకు, కథా వాతావరణానికీ అలవాటు చేస్తుంది. తెలియని విషయాలపట్ల, వ్యక్తుల పట్ల, జీవిత వివరాల పట్ల మనలో ఓ పీపింగ్ టామ్ ఉంటాడు. తేజస్వి దీనిని చక్కగా వాడుకుంటారు. సాహసాలు, అడవులు, వేట వంటి వస్తువులతో తెలుగులో కథలు రాకపోలేదు. ఈ వాతావరణంతోనే మనకు సి.రామచంద్రరావు ఇంతకన్న నేర్పరితనంతో కథలు చెప్పారు. వేట ఇతివృత్తంగా పూసపాటి కృష్ణంరాజు, పతంజలి, అల్లం శేషగిరిరావు వంటి వారు రాసారు. ఏమైనా ఈ పుస్తకంలా అవి పదహారు ముద్రణలు పొందలేదని మనం ఒప్పుకోవాలి. పుస్తకాలు కొని చదవటంలోనూ, మంచి రచయితలకు తమ సృజనతో కడుపు నింపుకునే అవకాశం ఇవ్వటంలోనూ, కన్నడిగులు మనకన్న చాలా ముందున్నారన్నది మనం తలొంచుకుని ఒప్పుకోవలసిన విషయం. కనీసం ఈ పుస్తకం విషయంలోనైనా మనమీదున్న ఈ చెడుపేరు తప్పించుకోటానికి దీనిని కొని చదువుదాం. తెలుగులో మనం చదవాలన్న ఆశతో దీనిపై కాలాన్నే కాక ధనాన్ని వెచ్చించిన శాఖమూరి రాంగోపాల్ గారికి కొని, కృతజ్ఞతలు చెపుదాం.
ఈ పుస్తకం అనువాదం గురించి కూడా ఓమాట అనుకోక తప్పదు. కథా వాతావరణానికి భాష అమిరినా, చదువుకోటానికి కాస్త అడ్డుపడుతుంటూనే ఉంటుంది. కొన్ని కన్నడ పదాలు ప్రతిభటన (ప్రతిఘటన) వంటివి వాడకుండా ఉంటే బాగుండేది.
అలాగే దాదాపు అన్ని కథల వెనుకా ఉస్మానియా విశ్వవిద్యాలయం లైబ్రరీనుండి నిద్రాణమైన కథలు అనటం సరిగా లేదు 16 ముద్రణలు పొందిన కథాపుస్తకాన్ని వెతికి తీసాననటం అనువాదకుని కృషిగా చెప్పవచ్చుగాని, పుస్తకానికి శోభనివ్వదు.

- వివిన మూర్తి
(ప్రజాసాహితి మే,2012 సంచిక నుంచి)

* * *

” పర్యావరణ కథలు” డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది. ఈ క్రింది లింక్‌ని అనుసరించండి.

పర్యావరణ కథలు On Kinige

Related Posts:

“మహార్ణవం” కథాసంపుటికి పురస్కారం

కొల్‌కతాలోని భారతీయ భాషా పరిషద్ 1974లో స్థాపించబడింది.

భారతీయ సాహిత్యం కోసం ఎనలేని సేవ చేస్తున్న సంస్థ ఇది. ఒక భాషలో వెలువడిన పుస్తకాన్నిఇతర భాషలలోకి అనువదింపజేసి, ఆ పుస్తకాన్ని అందరికీ అందుబాటులోకి తేవడం ఈ సంస్థ లక్ష్యాలలో ఒకటి.

అన్ని భారతీయ భాషలలోని సాహిత్యకారులను ఒక వేదిక మీదకి తెచ్చే ప్రయత్నంలో భాగంగా, ఈ సంస్థ 1980 నుంచి వార్షిక పురస్కారాలను అందిస్తోంది.

2011 వ సంవత్సరానికి భారతీయ భాషా పరిషద్, కలకత్తా వారి పురస్కారం – తెలుగులో- సుప్రసిద్ధ రచయిత్రి శ్రీమతి టి.శ్రీవల్లీరాధిక రచించిన “మహార్ణవం” కథాసంపుటికి – ప్రకటించబడింది.

ది 18 – 19 ఫిభ్రవరి 2012 తేదీలలో జరిగిన కార్యక్రమంలో రచయిత్రి ఈ అవార్డుని స్వీకరించారు. రచయిత్రికి అభినందనలు.

మహర్ణవం కథా సంపుటి డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది.

వివరాలకు ఈ క్రింది లింక్‌ను అనుసరించండి.

మహార్ణవం On Kinige

Related Posts:

‘కథ 2010’పై సాక్షి దినపత్రిక సమీక్ష

ఇరవయ్ ఒకటో ‘కథ’ అనే శీర్షికతో ది. 20 ఫిబ్రవరి 2012 నాటి సాక్షి దినపత్రికలో ‘కథ 2010’ సంకలనం పై సమీక్ష వెలువడింది.
‘కథ’ వార్షిక సంకలనాల వరుసలో ‘కథ 2010’ ఇరవయ్ ఒకటవది. ఇందులో పద మూడు కథలు ఉన్నాయి.

‘కథ’ సంకలనాలలో కనిపించే కథలూ, వాటి కథకులనూ పరిశీలిస్తే సంకలనకర్తల ప్రాధాన్యం అర్థమవుతుందని సమీక్షకులు వి. ఆర్. పేర్కొన్నారు. కొత్తదనం, ప్రయోగం సంపాదకుల దృష్టిలో అత్యవసరమని భావించారు.
ఎనభయ్యవ దశకం వరకు తెలుగు కథలు చదవగానే అవి బాగున్నాయో, లేదో రచయితలకే కాదు, సాధారణ పాఠకులకీ వెంటనే తెలిసేదని. ఇప్పటి కథలను చదివి జీర్ణించుకోవడానికి సాధారణ పాఠ కులతో పాటు రచయితలూ, విమర్శకులకు కూడా కొంత శోధన, ఓపిక అవసరమవుతోందని సమీక్షకులు అభిప్రాయపడ్డారు. ‘కథ’ సంకలనాలలో రకరకాల ప్రయోగాలు, ధోరణులు , అందుకు ప్రయత్నాలు కనిపిస్తాయని వి. ఆర్. అన్నారు. కొత్తదనాన్ని ఆహ్వానించడం అవసరమేనంటూ, అటువంటి ప్రయోగాలు ఎంతవరకు ఫలప్రదమైనాయో, వాటి ఫలితాలు ఎలా ఉంటున్నాయో చూడడమూ కూడా అవసరమే సమీక్షకులు భావించారు.

పూర్తి సమీక్షని ఈ లింక్‌లో చదవచ్చు.

కథ 2010 డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది. పూర్తి వివరాలకై ఈ క్రింది లింక్‌ని అనుసరించండి.

కథ 2010 On Kinige

అలాగే, ‘కథ’ పాత సంకలనాలు కూడా డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తాయి. మరిన్ని వివరాలకు ఈ లింక్‌ని అనుసరించండి.

కొల్లూరి సోమ శంకర్

Related Posts:

జుమ్మా

వేంపల్లి షరీఫ్ రాసిన ఈ కథల సంపుటిలో పన్నెండు కథలున్నాయి. భారతీయ సమాజంలో భాగమైన గ్రామీణ పేద ముస్లిం కుటుంబాల జీవితాలను ఈ కథలు చిత్రించాయి.
ఈ సంకలనంలోని కొన్ని కథల గురించి తెలుసుకుందాం.

పర్దా: ఈ కథలో ప్రధాన పాత్రధారి జేజి. అంటే నాయనమ్మ. కథకుడి నాయనమ్మ. ఇంటి పర్దాకి, ఆవిడకి ఎంతో సంబంధం ఉంటుంది. బీదకుటుంబీకుడైన కథకుడి తండ్రికి తన కూతురికి పెళ్ళి చేసేంత ఆర్ధిక స్తోమత ఉండదు. కనీసం సంప్రదాయబద్ధంగా ఉన్నట్లు కనపడినా తన కూతురికి ఏదో ఒక సంబంధం రాకపోదనే ఆశ అతనిది. అతని తల్లి పల్లెటూరి నుంచి వస్తుంది. అక్కడెంతో స్వేచ్ఛగా జీవితం గడిపిన ఆమెకి కొడుకు ఇంట్లో జరుగుబాటు కష్టం అవుతుంది. సంప్రదాయం పేరుతో, నాగరికత సాకుతో తనని కట్టిపడేయాలనుకోడం ఆమెకి నచ్చదు. కోడలి సూటిపోటి మాటలు, కొడుకు నిరాదరణ భరించలేక తిరిగి పల్లెటూరికే వెళ్లిపోతుంది. తమ గురించి నలుగురు ఏమనుకుంటారో అనే మధ్య, దిగువ తరగతి కుటుంబాలకుండే భయాన్ని ఈ కథ బాగా వ్యక్తం చేసింది.

జుమ్మా: ఇది ఓ అమ్మ కథ. ఓ కొడుకు కథ. ప్రార్థన అంటే, ముఖ్యంగా శుక్రవారం నమాజు అంతే తల్లికి ప్రాణం. దేన్నయినా సహిస్తుంది గానీ, శుక్రవారం నమాజుకి వెళ్ళకపోతే ఊరుకోదు. కొడుకు పెద్దవాడై హైదరాబాద్ నగరంలో ఉద్యోగానికొస్తాడు. తల్లిని నగరానికి రప్పించి, ఇక్కడ అన్నీ చూపించి మక్కా మసీదుకు తీసుకువెడతాడు.”ఇలాంటి చోట నమాజు చదివితే పుణ్యం నాయనా” అని ఆమె కొడుకుకి మళ్ళీ గుర్తు చేస్తుంది. సరేనంటాడు. కానీ బ్రతుకుపోరులో పడ్డాకా, ఎన్నో శుక్రవారాలు గడచిపోతాయి. ఒక దుర్ఘటన జరుగుతుంది. తల్లికి ఆ విషయం తెలిసాక, కొడుకుని మసీదుకే వెళ్ళద్దంటుంది. కడుపు తీపి ముందు దేవుడు చేదయ్యాడా? ప్రార్థన కానిదైందా అని కథకుడు బాధపడుతూ దేవుడిని స్మరిస్తాడు.

ఆకుపచ్చ ముగ్గు: పేరులోనే ఇతివృత్తం సూచన కలిగి ఉన్న కథ ఇది. చందమామ కనపడక, రంజాన్ ఏ రోజో తెలియక కథకుడు ఆలోచనల్లో ఉండగా కథ ప్రారంభమవుతుంది. ఇంతలో వాళ్ళ అక్క వచ్చి గోరింటాకు పెడుతుంది. తనకి గోరింటాకు పెట్టుకోడం ఇష్టం లేకపోయినా, అక్క మీది ప్రేమతో పెట్టించుకుంటాడు. అక్కకి పెళ్లయి ముగ్గురు పిల్లలు పుట్టినా, గోరింటాకుని వదలకపోవడంతో “అక్కా, నీకు గోరింటాకు పెట్టడమంటే ఎందుకింత ఖాసే..” అని అడుగుతాడు. దాని అక్క చెప్పిన సమాధానంతో కథకుడు నివ్వెరబోతాడు. అక్క గొప్ప తత్వవేత్తలా కనపడుతుందా క్షణంలో.

దస్తగిరి చెట్టు: కథకుడికి ఓ కోరిక ఉంటుంది. వేసవి సెలవల్లో తన అమ్మమ్మ వాళ్ల ఊరెళ్ళాలని. చిన్న కోరికే, కానీ తీరేది కాదు. ఎంత అడిగినా తల్లి పంపించడానికి ఒప్పుకోదు. గొడవ చేస్తే, కొడుతుంది, కంట్లో కారం పెడుతుంది. కానీ ఊరు పంపడానికి ఒప్పుకోదు. అమ్మమ్మ వాళ్ళ ఊరు వెడితే అక్కడ హాయిగా గడపచ్చు, మనసులోని కోరికలు తీర్చే దస్తగిరి చెట్టుకింద దోస్తులతో కాలక్షేపం చేయచ్చు అనే కోరిక కథకుడిది. తన తల్లి కుటుంబం బీదదని, వాళ్ళకే తిండికి గడవడం లేదని, మరో మనిషి వెళ్ళి అక్కడ ఉంటే ఆ భారం మోయడం కష్టమని కథకుడి తల్లి ఆవేదన. కొడుక్కి నచ్చచెప్పడానికి ప్రయత్నిస్తుంది. కథకుడు అమ్మమ్మ వాళ్ళకి, తమకి బోలెడు డబ్బు రావాలని దేవుడిని, దస్తగిరి చెట్టుని ప్రార్ధిస్తుండగా కథ ముగుస్తుంది. చదువరుల కళ్ళు చెమరుస్తాయి ఈ కథ చదువుతుంటే.

రజాక్‌మియా సేద్యం: ఓ ముస్లిం రైతు మానసిక సంఘర్షణకి అద్దం పట్టిన కథ ఇది. ఎలాగోలా తన పంటని కాపాడుకోవాలి అనే బెంగ ఒక వైపు, ఇంట్లో నూకలు నిండుకున్నాయనే దిగులు మరో వైపు రజాక్‌మియాని కృంగదీసేస్తుంటాయి. అతని పేదరికాన్ని అవసరాన్నిఅవకాశంగా తీసుకుని, అతని కొద్దిపాటి భూమిని కాజేయాలనుకుంటాడు ఓ రెడ్డి. కామందుల దాష్టీకం, బీద రైతుల నిస్సహాయతని ఈ కథ కళ్ళకు కట్టినట్లు వ్యక్తం చేస్తుంది. అలాగే, రోజూ కూలీ కోసం ఎంత దూరమైనా వెళ్ళి, సరైన ప్రయాణపు వసతులు లేక ప్రమాదాలు కొనితెచ్చుకునే బీదవారి జీవితాలను కళ్ళకు కడుతుంది.

అయ్యవారి చదువు: ఓ పేదవాడు చదువుకోడానికి ఎంత కష్టపడ్డాడో, చిన్నప్పుడు అలా ఎప్పుడూ చదువుతునే ఎందుకుండేవాడో చెబుతుంటే మనసు ద్రవించిపోతుంది. దీనిని ఓ ఉపాధ్యాయుడు తన విద్యార్ధికి కథలా చెబుతాడు. చదువు విలువ చాటి చెప్పే కథ ఇది.

జీపొచ్చింది: ఓ పేద రైతు కథ ఇది. పొలం బాగా పండాలని బోరు వేస్తాడు, కానీ నీరు చాలా లోతుకు వెడితే గానీ పడలేదు. ఆ నీళ్ళు పైకి తేవడానికి మోటారు కావాలి, మోటారు నడవడానికి కరెంటు కావాలి….. అప్పు చేసి మోటారు అద్దెకి తెచ్చుకుంటాడు, తన గేదెని అమ్మేసి మోటారుకి కరెంటు కనెక్షన్ ఇప్పించుకుంటాడు వెంకట్రెడ్డి. కానీ విధి వక్రిస్తుంది. బోరుఎండిపోతుంది. నీటి చుక్క పైకి రాదు. ఇదిలా ఉంటే కరెంటు బిల్ కట్టలేదంటూ కరెంటు ఆఫీసు వాళ్ళు మోటార్ల స్టార్టర్లు తీసుకుపోడానికి వస్తారు, వద్దని బతిమాలుతూ వాళ్ళ కాళ్ళమీద పడతాడు వెంకట్రెడ్డి. వాళ్ళు గట్టిగా విదిలించుకుని పోతారు. ఆ విదిలింపుకి రెడ్డి ప్రాణం పోతుంది. మనసు ఆర్ద్రమైపోతుందీ కథ చదివాక. హృదయం మొద్దుబారిపోతుంది.

పలక పండగ: చదువుకోవాలనే ఆశ ఉన్న ఓ కుర్రాడి కథ ఇది. పిల్లాడికి అక్షర జ్ఞానం కలిగితే, ఫీజు డబ్బులిస్తానంటుంది తల్లి. వాళ్ళ నుండి డబ్బులు రాబట్టాలంటే కుర్రాడికి చదువు వచ్చినట్లు నిరూపించాలి మాస్టారు. అందుకని ఓ పండగ సందర్భంగా అందర్ని పలకల మీద అక్షరాలు రాసుకురమ్మని చెబుతాడు. ఈ కుర్రాడికి పలక దొరకదు. వాళ్ళమ్మ ఎక్కడెక్కడో అడిగి చూసి, చివరికి తుక్కు సామాన్ల కొట్లో ఓ తుప్పు పట్టిన రేకు పలకని సంపాదించి కొడుక్కి ఇస్తుంది. దాని మీద ఎంత రాసిన అక్షరాలు పడవని తెలుసుకున్న కొడుకు దాన్ని విసిరేస్తే, అది తాకి తల్లికి గాయమవుతుంది. కోపంతో కొడుకుని ఉతికి ఆరేస్తుంది. ఏడుస్తూ పడుకుంటాడు. వాడికో చక్కని కల వస్తుంది.

చాపరాయి: అరకు దగ్గర చాపరాయి అనే పర్యాటక ప్రదేశంలో ప్రాకృతికంగా ఏర్పడిన శిలలపై పేర్లు చెక్కి వాటి సహజ అందాన్ని పాడు చేస్తున్నారని కథకుడు బాధ పడతాడు. అక్కడ ప్రేమికుల పేర్లు రాసే ఓ పెయింటర్‍ని కలిసి అతను చేసే పని తప్పని చెబుతాడు. బదులుగా ఆ పెయింటర్ కథకుడు చేస్తున్న తప్పు గురించి చెబుతాడు. దేన్నైనా ఒకరి దృష్టికోణం నుంచే చూడకూడదని, అవతలివారి కోణం కూడా ఒక్కోసారి సరైనదే అవుతుందని ఈ కథ చెబుతుంది.

ఇంకా కొన్ని చక్కని కథలున్న ఈ పుస్తకం డిజిటల్ రూపంలో కినెగెలో లభిస్తుంది. వివరాలకు ఈ క్రింది లింక్‌ని అనుసరించండి.

జుమ్మా On Kinige

కొల్లూరి సోమ శంకర్

Related Posts: