అభిజాత్య కన్నడ-తెలుగు భాషా (అనువాద) సంశోధన కేంద్రం (రిజిష్టర్డ్)
ఇం.నెం. 5-10, రోడ్ నెం. 21, దీప్తిశ్రీనగర్, మియాపూర్ పోస్ట్
హైదరాబాద్ – 500 049. ఫోన్ : 040-65520386
మొబైల్: 9052563666కృష్ణారెడ్డి గారి ఏనుగు
మూలం : దివంగత పూర్ణచంద్ర తేజస్వి
అనువాదం : శాఖమూరు రామగోపాల్
ఇం.నెం. 5-10, రోడ్ నెం. 21,
దీప్తిశ్రీనగర్, మియాపూర్ పోస్ట్
హైదరాబాద్ – 500 049.
ఫోన్ : 040-65520286
ధర : రూ. 100/-
ప్రథమ ముద్రణ
జనవరి, 2011
ప్రతులు : 1,000
డి.టి.పి.
చేగిరెడ్డి వెంకటేశ్వరరెడ్డి
సెల్: 9989253506
ప్రింటర్స్
శ్రీ ఉదయ్ ప్రింటర్స్
నారాయణగూడ, విఠల్వాడి
హైదరాబాద్
ఫోన్ : 64511385, 23260110
ప్రతులకు:
శాఖమూరు రామగోపాల్
ఇం.నెం. 5-10, రోడ్ నెం. 21, దీప్తిశ్రీనగర్,
మియాపూర్ పోస్ట్, హైదరాబాద్ – 49.
ఫోన్: 04065520286, మొబైల్:9052563666
ప్రచురణ/పంపిణీదారులు :
అభిజాత్య కన్నడ – తెలుగు భాషా (అనువాద) సంశోధన కేంద్రం (రిజిష్టర్డ్)
ఇం.నెం. 5-10, రోడ్ నెం. 21, దీప్తిశ్రీనగర్, మియాపూర్ పోస్ట్
హైదరాబాద్ – 500 049. సెల్ : 9052563666
కథాక్రమం
తేట తెలుగులో కన్నడ కస్తూరి.. 6
అభిశంస.. 7
ఏరిన ముత్యాలు…. 9
నా మాట.. 12
కృష్ణారెడ్డి గారి ఏనుగు… 15
ఒక రూపాయి….. 76
మాయదారి మనస్సులోని మర్మం….. 93
వ్యభిచారం…. 111
వరాహ పురాణం….. 136
కాంచన రధం…. 162
ఫలితం…. 179
పేగుబంధం…. 195
పగుళ్ళు….. 213
యాతన (హింస). 225
వదులుకోటం (తెంచుకోటం). 239
తాతగారి వారసత్వ పరుపు మీద మనమడికి ఎంత నిద్రో!. 248
ఆముదం త్రాగిన తాసీల్దారు… 259
పాపం పిచ్చయ్య స్థితి.. 271
వైరాగ్యంలోని మహిమ… 281
దివంగత పూర్ణచంద్ర తేజస్విగారు కన్నడంలో సహజసుందరంగా అందించిన కథలను సేకరించి వాటిని తెలుగువారికి అందించాలని అనువాదం చేసిన శ్రీ శాఖమూరు రామగోపాల్గారు అభినందనీయులు. అందులో పెద్ద కథ విలక్షణమైన కథగా ‘కృష్ణారెడ్డిగారి ఏనుగు‘ ఉన్నందువలన ఆ కథ విలక్షణం వల్ల ఈ కథా సంపుటికి ఆ కథ పేరే పెట్టడం జరిగింది.
కథా వస్తువు ఇతరులదైనా, దానిని అభిరుచి ప్రధానంగా తెలుగులోకి, తీసుకువచ్చారు. రామగోపాల్గారి తెలుగు కన్నడభాషా కస్తూరిని అద్దుకొన్నది. అప్పుడప్పుడూ దాని గుబాళింపులు గిలిగింతలు పెడతాయి. ఈ కథా సంపుటిలో తెలుగు వారికి నచ్చే అనేక కథలున్నాయి. ‘ఒక రూపాయి‘, ‘పేగుబంధం‘, ‘పాపం పిచ్చయ్య స్థితి‘ అందులో కొన్ని. కన్నడంలో 16 పర్యాయాలు ముద్రణ పొందిన ఈ రచనలు మూలంలోను అనువాదంలోను ఉత్కృష్టంగా రూపొందాయి. ఇంతకుముందు ‘వాల్మీకి‘ని అందించిన రామగోపాల్గారు అభినందనీయులు. నిజంగా చెప్పాలంటే తెలుగు సాహిత్యానికి అందించిన ఆభరణం ఈ కథల సంపుటి.
ఎల్లూరి శివారెడ్డి
ప్రధానకార్యదర్శి
ఆంధ్ర సారస్వత పరిషత్తు
హైదరాబాద్
‘వాల్మీకి‘ అనువాద ఆత్మ చరిత్రను అనువదించిన శ్రీశాఖమూరు రామ్గోపాల్గారు ‘కృష్ణారెడ్డిగారి ఏనుగు‘ అనే పేరుతో కన్నడభాషలోని కొన్ని మంచి కథలను తెలుగులోకి అనువాదం చేసి సంకలనం చేశారు. ఈ అనువాదం చదువుతూ ఉంటే రామ్గోపాల్గారికి తెలుగు, కన్నడ భాష రెండింటిలో సమానమైన అధికారం ఉన్నదన్న విషయం స్పష్టమవుతున్నది.
మూలరచనలోని భావాన్ని, అర్థాన్ని, అందాన్ని చెడగొట్టకుండా రామ్గోపాల్గారు ఈ రచనలను తెలుగు పాఠకులకు చక్కగా అందించారు. పాఠకులు ఈ అనువాద కథా సంకలనాన్ని చదవడం ప్రారంభిస్తే, ఏకబిగిన చదివించే శైలి రచయిత సొంతమని ఈ పుస్తకం తెలియచేస్తున్నది.
కన్నడభాషకు భారతావనిలో ఒక విశిష్టస్థానముంది. ఏడుగురు వ్యక్తులు ఒక భాష నుంచి జ్ఞానపీఠ ప్రశస్తి పురస్కారంను పొందిన సౌభాగ్యం కన్నడభాషకే దక్కింది. తనను తను పరిరక్షించుకోవడానికి, తను సరిహద్దు రాష్ట్రాలలోని తెలుగు, తమిళం, మళయాళం, మరాఠి భాషల ప్రభావం నుంచి బయట పడేందుకు ఎంతగానో శ్రమించాల్సి వస్తుంది. అంతేగాకుండా తనలోనే దాగిన ఇంగ్లీష్, తుళు, కొడవ, బ్యారి, కొంకణి, ఉర్దూ భాషల దాడి నుంచి అది (కన్నడం) తనని తను రక్షించుకోవడానికి ఎంతగానో శ్రమపడుతూ తద్వారా తన శక్తి సామర్థ్యాన్ని మరింతగా పరిపుష్టి చేసుకొంటున్నది.
‘కృష్ణారెడ్డిగారి ఏనుగు‘ సంకలనంలోని కథల విషయానికి వస్తే ఇందులోని కథలు కాలాతీత రచనలు అని చెప్పవచ్చు. ఈ కథలలోని పాత్రలు, పాత్రలలోని జీవితాలు, వారి వ్యక్తిత్వాల వర్ణన గ్రామీణ ప్రాంతాలలోని సొగసులలో మమేకమై సహజత్వాన్ని సంతరించుకున్నాయి.
తెలుగు పాఠకులు ఈ కథలను చదివి ఆస్వాదించి రామ్గోపాల్ వంటి అనువాద రచయితలకు ఆలంబనగా నిలుస్తారని ఆశిస్తాను.
ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్
అధ్యక్షులు
ఆంధ్రప్రదేశ్ హిందీ అకాడమి,
హైదరాబాదు.
సాధారణంగా కనబడే శ్రీ శాఖమూరు రామగోపాల్ అసాధారణమైన పనులను చేస్తుంటారు అని చెప్పేందుకు దోహదపడే ‘కృష్ణారెడ్డిగారి ఏనుగు‘ అనే శిరోనామంతో పాఠకుల ముందుకు వస్తున్న ఈ పుస్తకం ఒక అక్షర సాక్ష్యంగా మనముందు నిలబడుతది. రామగోపాల్ ఎంతో ఇష్టంగా కన్నడ కథా సాహిత్యంలోని కొన్ని గొప్ప కథల్ని ఎన్నుకొని వాటిని తెలుగులోకి అనువదించారు.
పూర్ణచంద్ర తేజస్వి, శాంతరస, నాగమంగల కృష్ణమూర్తి, కూదవళ్ళి అశ్వత్థ నారాయణరావ్, కుం. వీరభద్రప్ప, ఆర్.టి. శరణ్, ఎస్. తమ్మాజిరావ్, కె. సత్యనారాయణ, హెచ్. రమేష్ కెదిలాయ, ఎ.ఆర్. కృష్ణ శాస్త్రి, గోరూరు రామస్వామి అయ్యంగార్, కు.వెం.పు మొదలైన కథకులు తమ విశిష్ట రచనల ద్వారా కన్నడ కథా సాహిత్యాన్ని పరిపుష్టం చేసిన కథకులని ప్రత్యేకించి నేను చెప్పాల్సిన పని లేదు. వీరి కథలు చదివితే ఆ విషయం పాఠకులైన మీకే బోధపడుతది.
అనువాదం అంటేనే కష్టంతో కూడుకున్న పని. ఎందుకంటే అనువాదం చేసే వ్యక్తికి అటు మూల భాష (కన్నడం); ఇటు లక్ష్య భాష (తెలుగు)… ఈ రెండిటికి సంబంధించిన సమగ్ర పరిజ్ఞానం ఎంతో ఉండాలి. ప్రత్యేకించి కల్పనా సాహిత్య సంబంధమైన నవలల్ని, కథల్ని (కథానికల్ని) అనువాదం చేయడం అంత సులువైన పనేమీ కాదు. పాత్రల స్వభావాలు, పాత్రల అంతరంగాలు, సంభాషణల లోతు, నేపథ్యాల మూలాలు, కంఠస్వరాల అంతరార్థాలు, రచయితల ఉద్దేశం, రచయిత ప్రాపంచిక దృక్పథం మొదలైన అనేక అంశాలు మూలభాషలో లాగనే లక్ష్యభాషలోకి రావాలి. రచయిత హృదయ ఆవిష్కరణ జరగాలి. అప్పుడే అది మంచి అనువాదం అన్పించుకొంటది. అందువల్లే ఒక భాషలో ఎన్నో అనువాదాలు వస్తున్నా కొన్ని మాత్రమే కలకాలం గుర్తుంటాయి. అలా గుర్తుండి పోయే అనువాదాలలో ఒకటిగా రామగోపాల్గారి ‘కృష్ణారెడ్డి గారి ఏనుగు‘ అనే శీరోనామంతో ఉన్న ఈ అనువాద కన్నడ కథామాలిక చిరస్థాయిగా నిలుస్తదని నా వ్యక్తిగత అభిప్రాయం. రామగోపాల్ తెలంగాణా, రాయలసీమలకు సరిహద్దుగా ఉండే కర్నాటక రాష్ట్రంలోని రాయచూరు జిల్లాలో కొద్ది కాలం వ్యవసాయం చేయటం వలన, తన మాతృభాష కన్నడం గాకపోయినా కన్నడం నేర్చుకొని, ఆ భాషలోని మాధుర్యాన్ని ఒడిసి పట్టుకొని, దివంగతురాలైన తన తల్లి ఋణం తీర్చుకోడానికి అన్నట్లు ఇప్పుడెంతో శ్రమ కోర్చి, నిస్వార్థంగా నిరాపేక్షతో కన్నడ నగమేరు ధీరులైన కథకుల కథల్ని మనకు అనువదించి అందించడం వెనుక అతనికి సాహిత్యం పట్ల ఉన్న అభిరుచి, మమకారం, గౌరవం ఎలాంటిదో తెలుస్తుంది.
రామగోపాల్ సాదాసీదాగా నిరాడంబరంగా కన్పించినా ఎంతో లోతైన అవగాహన, పరిశీలన, విషయ పరిజ్ఞానం కలిగిన వ్యక్తి. అనువాద క్రీడను దైవంగా భావించే వ్యక్తి. పట్టు వదలని విక్రమార్కుడి లాంటి వ్యక్తి. ఈ మాట (వాక్యం) ఎందుకు చెపుతున్నానంటే – వైయక్తిక కారణాలవల్ల గత నాలుగేళ్ళుగా సృజనాత్మక సాహిత్యం వైపు కన్నెత్తి చూడలేకపోయిన నన్ను మళ్ళీ అటువైపుకు ఓర్పుతో నేర్పుతో మళ్ళించిన వ్యక్తి రామగోపాలే!
నా స్వంత విషయం ఇక్కడొక మాటగా చెప్పాలి. కన్నడ భాషా పత్రికలు కథల్ని ఎంతగానో గౌరవిస్తాయి. నేను రాసిన ఊరి మద్దిస్తం, మహా విద్వాంసుడు… ‘పంచాయితీ‘ ‘నాదస్వరం‘ అనే పేర్లతో దిన పత్రికైన కన్నడ ప్రభలో ప్రచురించబడినవి. సుప్రసిద్ధ కథకుడు మరియు నవలా రచయితైన కుం. వీరభద్రప్పగారు నా కథల్ని కన్నడంలోకి అనువదించారు. అవి ‘కథా కావ్యం‘ అనే పేరుతో కన్నడ ప్రభలో అచ్చయిన విధానం చూస్తే మనస్సు ఎంతగానో ఉప్పొంగిపోయింది. కన్నడ ప్రభలో ఆ శీర్షిక క్రింద కథ తప్పితే మరేమి ఉండదు. మనకు లాగా గజ్జి తామర మందుల ప్రకటనల మధ్య కథను ప్రచురించకపోవడం ఎంత అదృష్టం రచయితలకు!
రామగోపాల్ అనువాదం చేసిన ప్రతి కథా ఒక ఏరిన ముత్యం లాంటిది. ప్రతి కథలోనూ దేని ప్రత్యేకత దానిదిగానే ఉంది. ప్రతి కథలో కన్నడ మట్టి వాసన కొట్టొచ్చినట్లు కన్పిస్తుంది. తనది యథాతథ అనువాదం అని రామగోపాల్ చెపుతున్నా ఈ కథల్ని చదువుతుంటే కన్నడ కస్తూరి అనే నానుడి పదే పదే గుర్తుకొస్తుంది. తప్పక ఈ కథలు తెలుగు పాఠకుల హృదయాలలో చెరగని ముద్ర వేస్తాయి. వాళ్ళ భావ సంస్కారాలలో మార్పును తెస్తాయి. ఆలోచనలలో, అవగాహనలలో మార్పును తెస్తాయి. సాహిత్యానికి ఇంతకంటే గొప్ప ప్రయోజనం ఏముంటుంది.
ఇరుగు పొరుగు మనుషులతో సంబంధాలు తెగిపోతున్న ఈ రోజులలో ఇలాగైనా (అనువాదాల రూపంలో) ఇరుగు పొరుగు రాష్ట్రాల మధ్య భిన్న భాషా సంస్కృతుల మధ్య కల్సియుండాల్సిన గొప్ప అనుబంధాల్ని పెంపొందించుకుందాం భారతీయులలాగ.
చివరిగా ఒక మాట సుమా…. శ్రీ శాఖమూరు రామగోపాల్ మనకు కన్నడిగులకు మధ్య ఒక వారధిలా నిలబడి, మున్ముందు మరిన్ని మంచి కథల్ని అనువదించి, అందించి మనందరి మన్ననలకు పాత్రుడవుతాడని ఆశిద్దాం…. ఈ కథల్ని ఆదరిద్దాం…..!
ఆచార్య తుమ్మల రామకృష్ణ
తెలుగు శాఖ, మానవీయ శాస్త్రాల విభాగం
హైద్రాబాద్ విశ్వవిద్యాలయం, సెంట్రల్ యూనివర్సిటీ పోస్టు
హైద్రాబాద్ - 46
23-05-2009
కొన్ని దశాబ్దాల క్రితం, ఎం.ఏ. పాసైన మీదట నేను(కర్నాటకలోని రాయచూరు జిల్లాలో మాకు ఉమ్మడిగా వారసత్వ వ్యవసాయ భూములున్నందున) మేనేజ్మెంట్ ట్రైనీ లాగ వ్యవసాయం చేసినప్పుడు నా మాతృభాష గాని దాన్ని (కన్నడంను) పట్టుదలతో దివంగతురాలైన నా మాతృమూర్తి అభిలాషతో నేర్చుకొన్నాను.
ఆ మీదట ఈ భాగ్యనగరంకు రావటం, ఇక్కడే నివసిస్తుండటం, ఏదైనా సంఘ కార్యాన్ని చేయాలనే సత్సంకల్పంతో ఇంటి నుంచి ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని వాచనాలయం, సిటీ సెంట్రల్ లైబ్రరి, కర్నాటక సాహిత్య మందిరం మొదలైన చోట్లకు వెళ్ళినపుడు ఈ కథలను కనుగొని వాట్ని తెలుగులోకి అనువదించాను. కొన్ని కథలు కన్నడప్రభ దినపత్రిక నుంచి సేకరించాను.
మన గ్రామీణ తెలుగు లోగిళ్ళలో దేవతామూర్తుల పటాలు కొలువైనట్లుగా, గ్రామీణ కన్నడిగుల ఇళ్ళలో దేవతామూర్తుల పటాల చెంతనే దిగ్గజులైన సాహితీమూర్తుల చిత్ర పటాలు చేరికొనియున్న విశిష్టతను మరియు నా మాతృమూర్తి కు.వెం.పు గార్ని; వారి కుమారుడైన పూర్ణచంద్ర తేజస్వి గార్ని….వారి ఘనతలను పదే పదే చెపుతుండటంతో వారి రచనల వెతుకులాటలో (ఈ భాగ్యనగరంలో) నేను నిమగ్నమవ్వగా ‘కృష్ణారెడ్డిగారి ఏనుగు‘ మరియు ‘వైరాగ్యంలోని మహిమ‘ కథలను కనుగొని వాటికి జతగా ఇతర రచయితల కథలను జమచేసి ఒక పుస్తకంగా ఇప్పుడు నేను మీ ముందు ఉంచుతున్నాను.
కెలస విల్లద బడగి ఏనో కెత్తిద (పనిలేని వడ్రంగి ఏదో చెక్కాడు – ಕೆಲಸ ವಿಲ್ಲದ ಬಡಗಿ ಏನೋ ಕೆತ್ತಿದ) అని నన్ను, నా ఈ అనువాద చర్యను అపహాస్యం చేసిన వారికి సమాధానంగా ఈ పుస్తకంను మీ ముందుకు తెస్తున్నాను.
ముందుమాటను వ్రాయించుకొనే సందర్భంలో ఎందరో ప్రఖ్యాత తెలుగు రచయితలను కల్వటం నా అదృష్టంగానే భావిస్తాను.
ఎనగింత కిరియరిల్ల…. శివభక్తరగింత హిరియరిల్ల (నాకన్నా చిన్నోళ్ళులేరు… శివభక్తులకన్నా పెద్దోళ్ళు లేరు – ಎನಗಿಂತ ಕಿರಿಯರಿಲ್ಲ … ಶಿವಭಕ್ತರಗಿಂತ ಹಿರಿಯರಿಲ್ಲ) అనే వచన సూక్తి నుంచి ఈ పుస్తకంకు ముందు మాటను రాసిన ఆచార్య ఎల్లూరి శివారెడ్డి, ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, ఆచార్య తుమ్మల రామకృష్ణ గార్లకు నేను చిరఋణి అవుతాను.
డి.టి.పి.ని చేసిన……
ముఖ చిత్రం గీసిన….
పుస్తకంను ముద్రించిన….
మరియు నా తిరుగాట (రోజుకు 60కి.మీ) భారంలోని అసహనంను వెళ్ళగ్రక్కితే, సహించుకొంటూ చేయూతనిచ్చిన నా పరివారంలోని ప్రమీళలైన నా అర్థాంగి వనజారామగోపాల్కు, నా పుత్రికలైన కుమారి దివ్యరాణి, దీపరాణి, దేవకిరాణిలకు కృతజ్ఞతల్ని తెలియజేసుకొంటూ
మాతు బెళ్ళి మౌన బంగార (మాటేమో రజితం, మౌనమేమో బంగారం – ಮಾತು ಬೆಳ್ಳಿ ಬಂಗಾರ) అనే /జానపద మాటను స్ఫురణకు తెచ్చుకొంటూ…
నా ఈ పుస్తకాన్ని మా నాయనమ్మ-తాతగారు అయిన కీర్తి శేషులు శ్రీమతి శాఖమూరు రామలక్ష్మమ్మ…. అప్పయ్యగార్ల స్మరణకు అంకితమిస్తూ…
కైమోడ్పులతో
ఇంతియే
తమ విధేయుడైన
శాఖమూరు రామగోపాల్
ఫోన్ నెం. 040 – 65520286
22-02-2010
మొబైల్ 9052563666
1
పాతబడిపోయిన నా ఫోర్డ్ జీప్లోని గేర్ బాక్స్ అప్పుడప్పుడు రిపేరుకు వస్తూ నాకు కష్టాల్ని ఇస్తూనే ఉంది. దాన్ని నేను ఎన్నోసార్లు రిపేరు చేసేదాన్ని చూసిన కొంతమంది “పాత మిలటరి జీపుల నుదుటిరాతే ఇంత; దాని గేర్ బాక్స్ను తీసేసి కొత్త మోడల్లోని విల్లీస్ జీప్ గేర్ బాక్స్ను జోడించండి” అని సలహాలను ఇస్తుండేవారు. అయితే నాకు ఈ పురాతన కాలంలోని జీపుకు చెందిన పాత భాగాలను తీసేసి దాని ఒరిజినాలిటీని పాడుచేసేది సరైనదిగా అన్పించలేదు. నా ఈ ఒరిజినాలిటిని ఉంచే ప్రయత్నాల మూలాన నెలకొకసారి జీపు అడుగు భాగంలో ఉండే గేర్ బాక్స్ను విప్పి రిపేరు చేసే పని ఖాయమైంది.
ఆ రోజు జీపు అడుగు భాగాన గేర్ బాక్స్ రిపేరులో నేను నిమగ్నమైయున్నప్పుడు, రెండు ఖాకీ ప్యాంటుల కాళ్ళు నా దగ్గరకు వచ్చేది కనబడింది. నాకు పోలీస్డిపార్ట్మెంట్ తక్షణమే జ్ఞాపకంకు వచ్చి భయాన్ని చెందినా, ఆ వచ్చినోళ్ళ కాళ్ళకు బూట్లు లేనందుచేత, వేరే డిపార్ట్మెంట్కు చెందినోళ్ళవ్వచ్చని భావిస్తూ బోల్టులను విప్పసాగా. వచ్చినోడు నేను జీపు అడుగు భాగాన ఉన్నందుచేత అతనొచ్చినదాన్ని గమనించలేదేమోనని తలంచుతూ ఒకట్రెండు సార్లు దగ్గాడు.
మా ప్రాంతంలో దగ్గు అనేది కాలింగ్ బెల్ లాగ ఇంటివద్ద ఎవరూ కళ్ళకు కనబడకపోతే, దగ్గి క్యాకరించి సప్పుళ్ళను చేస్తూ ఆ వచ్చినోళ్ళు తమ ఉనికిని తెలియజేస్తారు. బహుశః భాషను ఉపయోగించి పిలవాలని అనుకొంటే కొన్ని కష్టాలు ఎదురౌతవేమో. ఇంట్లో వాళ్ళ పేర్లు ఏమిటి? పేరుతోనే పిలవొచ్చా? స్వామి అని సంబోధించాలా? సార్ అనాలా? బహువచనం ఉపయోగించాలా? ఏకవచనంతో పిలవొచ్చా? ఇలాగున భాషను ఉపయోగించి పిలవాలంటే ఎన్నో అడ్డంకుల్ని ఎదురించాల్సి వస్తుంది. దానికి విరుగుడుగా ఒకట్రెండుసార్లు దగ్గితే ఈ సమస్త కష్టాలు ఉండవు కదా! అందుచేతనే వచ్చినోడు ఒకట్రెండు సార్లు దగ్గాడు.
“ఎవరయ్యా నువ్వు?” అని అడిగా
“నేను స్వామి”
“నేనంటే ఎవరయ్య? నాకు ఇక్కడ నీ కాళ్ళు మాత్రమే కనబడుతున్నవి”
“నేను లైన్మ్యాన్ స్వామీ”
“ఎవరు లైన్ మ్యాన్ తిప్పణ్ణేనా?”
“థు థూ టెలిఫోన్ డిపార్ట్మెంట్ కాదండి. నేను కరెంటోడ్ని. లైన్మ్యాన్ దుర్గప్పనండి”
“అదెందుకు టెలిఫోన్ డిపార్ట్మెంటోళ్ళను థుథూ అంటావు? వాళ్ళను చూస్తే నీకు సహించదా? ఇద్దరి డ్యూటీ స్తంభాల్ని ఎక్కేదేకదా?”
“అదొక నెత్తినొప్పి డిపార్ట్మెంట్ సార్. మా తీగల దగ్గరకు మీ తీగల్ని తేకండి, టెలిఫోన్ గొరగొర అంటది…. అలా ఇలా అంటూ రోజూ మాతో తగాదా పడ్తూనే ఉంటారు”
నేను జీపు అడుగు భాగాన్నుంచి బయటకు వచ్చా. దుర్గప్ప తన చేతిలో కటింగ్ ప్ల్యేయర్, తీగల చుట్టను పట్టుకొని నిలబడ్డాడు.
“ఏంటయ్యా…. ఏంటి విషయం?” అని అడిగా
“విషయం ఏమి లేదండి”
“మరెందుకు వచ్చావు?”
“ఊరికే వచ్చా ఇలాగున” అన్నాడు దుర్గప్ప.
అతని మాటలను వింటే పనేమి లేకనే ఖాళీగా ఉన్నందుచేత ఇక్కడి వరకూ వచ్చాడనే అర్థం కలుగుతుంది. అలాగైతే ఏదో ఇనామునో లేక చందా వసూలుకో, అదీ కాకపోతే ఇంటి అవసరానికని కాఫీ గింజలనో, యాలక్కి (ఇలాచి)నో అడిగేందుకు ఈ రీతిగా పీఠికను వేస్తున్నాడని ఊహించసాగా. మా దగ్గర ఇదొక పెద్ద నెత్తినొప్పి. వచ్చినోళ్ళు వచ్చిన పని ఏమిటనేది జటాపటంగా చెప్పేది లేదు కదా! మా మూడ్ (స్వభావం) ఎలాగుందోనని లెక్కవేస్తూ, చెప్పాలో వద్దో అని నిర్ధారించుకొంటూ, అది ఇదీ మాట్లాడుతూ నించొంటారు. మేమే నానా విధాలుగా వాళ్ళను అడగికొని వాళ్ళ నోటిని విప్పాలి. అంతవరకూ వాళ్ళు వచ్చిందానికి సంబంధం లేని విషయాలను మాట్లాడుతూ అన్యమనస్కులై నించోనే ఉంటారు లేండి. నాకు ఇదంతా సహించుకొనే ఓర్పు ఉండేది లేదు.
“ఎందుకని ఇక్కడి వరకూ వచ్చావు ఇలాగున? వచ్చిన విషయం ఏమిటని తొందరగా చెప్పు మహానుభావా! నీ దగ్గర మాట్లాడుతూ నించోటానికి నాకు ఖాళీనే లేదు” అంటూ అసహనమైన ధ్వనితో చెప్పాను.
“ఏమి లేదండి….. కొంచం గొడ్డలి ఉంటే ఇవ్వండి స్వామి”
“ఓస్…. అంతేనా! మరెందుకు ఏమిలేదని చెప్పావు?”
“ఇదేమి పెద్ద విషయమా చెప్పేందుకు…. సార్”
“కరెంట్ పనికి గొడ్డలెందుకు?”
“ఒక చెట్టు విరిగి తీగల మీద పడింది సార్… దాన్ని కొట్టి లైను క్లియర్ చేయాలి….ఆ దరిద్ర కృష్ణారెడ్డి గారి ఏనుగు చేసిన పనే అయ్యుండొచ్చు… చెట్టు చెంతనే దాని లద్ది (పెంట) పడియుంది. చెట్టు ఆకుల్ని తినేందుకు వెళ్ళి, కొమ్మల్నే విరగొట్టింది”.
“అది ఎలాగున ఏనుగే చేసిన పనే అని అనగలవు. తీగల మీద నుంచి కొమ్మల్ని లాగితే దాన్కి కరెంట్షాక్ కొట్టి చనిపోతది కదా?”
“మరింకేంటి…. దాన్దే ఆ పని. ఆ చెట్టు క్రింద తట్ట బుట్టంత పడియుంది దానిపెంట. ఆదివారం రిపేరు పనులకని లైనును ఆపుచేస్తాము. లైను చార్జ్లో ఉండుంటే ఈపాటికది భస్మమైయుండేది. కిలాడి ముండ ఆ ఏనుగు. నేను ఉదయాన్నుంచి నాలుగైదు సార్లు చార్జ్ చేసా. ఏమి చేసినా ఫీజు నిల్వటలేదు. లైను ట్రబుల్లో ఉందని తీగల వెంబడే చూసుకొంటూ వచ్చాను. శివనాయుడి గారి సామిల్ దగ్గర కొమ్మ ఒకటి లైను మీద పడియుంది.”
“గొడ్డల్ని అటక మీద (మచ్చు మీద) వేసాము దుర్గప్పా. నువ్వే ఎక్కి వెతుక్కొని తీసుకెళ్ళు” అని చెప్పి మరలా నేను జీపు అడుగు భాగంకు చొరబడ్డాను. దుర్గప్ప అటకెక్కి దడబడ సప్పుళ్ళను చేస్తూ గొడ్డల్ని వెతికాడు. కొంచంసేపు అయిన తర్వాత గొడ్డలి దొరికిందని చెప్పి దాన్ని తీసుకొని వెళ్ళిపోయాడు.
దుర్గప్ప గొడ్డలిని తీసుకొని నిర్గమించిన తర్వాత మరలా రానేలేదు. మూడు నాలుగు రోజులు గడిచినా దుర్గప్పడి జాడేలేదు. గొడ్డలి సంగతి అంతే ఇక.
ఆ గొడ్డల్నైనా అబద్దాల్ని చెప్పి దోచుకొని పోయేంతగా అదెంతో అమూల్యమైనదేమి కాదులే. చెఱువు పనికని వచ్చిన వడ్డెరలు మట్టిని తోడేటప్పుడు (తవ్వేటప్పుడు) అడ్డుపడే వేర్లను కొట్టేందుకని నా గొడ్డల్ని తీసుకొని, రాళ్ళను మట్టిని వేరే వేరేగా చూడకనే ఎర్రి ఎర్రిగా ఆ గొడ్డల్ని వాడి దాని అంచు ఎక్కడ, తల భాగం ఎక్కడ అనేది తెల్వనట్లుగా
మొండిదానిగా పాడుచేసారు. ఇప్పుడు దాన్ని సుత్తిగా పిలవొచ్చు. దాన్తో దుర్గప్ప ఏ విధంగా చెట్టును నరుకుతాడో తెల్వదు కదా! ఏమైనా కానీ… దాన్నే అతను వెతికి తీసుకొని వెళ్ళినందున మొండు గొడ్డల్ని ఇచ్చానని నన్ను అతను దూషించేది లేదులే. దాన్ని అతను అకస్మాత్తుగా దొంగిలించినా నాకేమి గొడ్డలి పోయిందనేది దుఃఖాన్ని కలుగజేయదులే. అందుచేత నేను దుర్గప్పను వెతికి గొడ్డల్ని వసూలు చేసుకొనే గొడవకు వెళ్ళనే లేదు.
అలాగైతే దుర్గప్ప గొడ్డల్ని తీసుకొని ఎక్కడికి వెళ్ళాడు? ఆలోచిస్తుండగా నాకు అతను కృష్ణారెడ్డిగారి ఏనుగును దూషించింది జ్ఞాపకానికి రాసాగింది.
2
కృష్ణారెడ్డి గారి ఏనుగు అడవి నుంచి పట్టుకొని వచ్చి ట్రైనింగ్ ఇప్పించిన ఏనుగైతే కాదులే. పర్వత ప్రాంతంలో క్రిందనున్న గూళూరు మఠంలోని ఏనుగుకు చెందిన సంతతిలోనిదే కృష్ణారెడ్డిగారి దగ్గరున్న ఏనుగు అది! అది పుట్టింది, పెరిగింది అంతా ఊరిలోని జనాల నడుమే. అందుచేత దానికి అడవి గురించి కాని, అడవిలో ఉండేటి ఇతర అడవి ఏనుగుల మీద కాని ఏమి తెలిచింది లేదనేది కనబడుతుండేది మాకు. ఆ ఏనుగు ‘మూడిగెరె‘ పట్టణంలో ఎంతగా కల్సిపోయిందంటే ఊర్లోని పశువుల రీతిగానే ఏ విధమైన సంకెళ్ళు, ఇనుప గొలుసులు లేకుండానే పట్టణంలో తిరుగుతుండేది. స్కూల్ పిల్లలు దాని దగ్గరకు వచ్చేందుకు బెదురుతున్నా వాళ్ళు దూరం నుంచే ‘గౌరి‘ అంటూ కేకల్ని పెట్తే చాలు తొండాన్ని ఎత్తి నమస్కారాన్ని చేస్తుండేది. దారి అంచున డబ్బా పెట్టెల అంగడోళ్ళు మిగిలిపోయిన అరటి పండ్ల గెలలను, పాడైన ఇతర ఫలాలను దానికిచ్చేందుకు నిల్వ చేసుకొనేవారు. ఈ ఏనుగు ఖచ్చితంగా అన్ని డబ్బా పెట్టెల అంగళ్ళ వద్దకు వెళ్ళి వాటన్నిట్ని తొండంతో తీసుకొని తింటుండేది.
మఠంకు పీఠాధీశుడైన జగద్గురువును జనం అడ్డ పల్లకిలో తమ తమ భుజాల మీద పెట్టుకొని మోయటం చేయసాగినందున, ఏనుగుకు జగద్గురువును మోసేపని తప్పిపోయింది. అందుచేత నిరుపయుక్తంగా ఉన్న ఈ ఏనుగును, దాని కన్నా ముఖ్యంగా దాని మావుటోడ్ని బయటకు సాగనంపి చేతుల్ని దులుపుకొనేందుకు మఠంవాళ్ళు ప్రయత్నాలను చేయసాగారు. మావుటోడైన వేలాయుధంను సాకేది, ఆ ఏనుగును సాకేదానికన్నా ఎంతో కష్టదాయకంగా ఉండేది మఠం వాళ్ళకు. ఇరవై నాలుగు గంటలూ సురాపానంతో ఉండేటి ఈ మావుటోడు, మఠంలోని సాత్విక వాతావరణంకు పెద్ద
తలనొప్పిగా అయ్యాడు. అతడి దుర్నడతను చీదరించుకొని ఒకసారి అతడ్ని బయటకు గెంటివేయగా ఏనుగు అనేక దినాల వరకూ ఎవరి మాటలను వినకనే తిండి తినటమే ఆపేసింది. చివరికి ఏనుగు ఉండేంతవరకూ తన అనివార్యతను తెలుసుకొన్న ఆ మావుటి, మఠానికి ఇంకా అధికంగా కిరికిరి ఇవ్వనారంభించాడు. ఇదంతా ఎంతో వెనుకటి సుద్ధి. ఏనుగు మా పట్టణమైన మూడిగెరెకు చేరేముందు నడిచింది ఈ సుద్ది.
‘చార్మాడిఘాట్‘ దగ్గర దట్టమైన అడవిని సర్కారోళ్ళు విమ్కొ (ఇ|ఖఖ్పుం) కంపెనీకి అగ్గి పుల్లల్ని చేసుకొనేందుకని కాంట్రాక్ట్ను ఇచ్చారు. చార్మాడిఘాట్ లోయలలోని పాతాళంలో ఉన్న వృక్షాలను లారీల దారికి తెచ్చేందుకు ఏనుగులు లేకుండా మరి దేనితోనూ ఆ రవాణా సాధ్యంలేదు కదా! కేరళ నుంచి ఏనుగులను బాడుగకని తీసుకొచ్చేదాన్ని యోచించుతున్న విమ్కొ కంపెని వాళ్ళ వద్ద కృష్ణారెడ్డి ఆ ఏనుగుల పనిని తనకే కాంట్రాక్ట్ ఇవ్వమని అడిగాడు. కృష్ణారెడ్డి దూరంలోని గూళూరు మఠంకు చెందిన ఈ ఆడ ఏనుగును ఖరీధించి మూడిగెరెకు తెచ్చింది కొన్ని రోజుల క్రితమే. ఏనుగుకు జతగా మావుటోడైన వేలాయుధం సంసార సమేతంగా ‘మూడిగెరె‘కు వచ్చాడు. ఆ ఏనుగును, ఎంతో డబ్బుపోసి కొనుకొచ్చానని కృష్ణారెడ్డి బడాయిగా చెప్పుకొంటున్నా, అతను ఇచ్చిన డబ్బు నిజంగా ఆ ఏనుగు తోకకూ అది సరిపోదు. మఠం వాళ్ళు మొదలే ఈ ఏనుగును మావుటోడితో సహా ఎవరికైనా ఇచ్చేసేదాన్ని ఎదురు చూస్తుండటం చేత కృష్ణారెడ్డి ఆ ఏనుగును ఖరీదుకని అడిగిన తక్షణమే వేలాయుధం మఠంలో చేసిన నాల్గైదు వేల రూపాయల అప్పును తీరిస్తే చాలనుకొని ఆ ఏనుగును అమ్మేందుకు ఒప్పుకొన్నారు.
అన్ని రకాల వ్యాపారాలను చేసి, అన్నిట్లోనూ నష్టాల్నే అనుభవించి అలిసిన కృష్ణారెడ్డి ఏనుగును తెచ్చినప్పుడు ఇంతటితో ఇతని కథ ముగుస్తదని అందరూ తీర్మానించుకొన్నారు. ఏనుగును సాకేదంటే ఎలెక్షన్కు నించొన్నట్లుగా ఉంటది. ఇంటిని గుల్లచేసుకొని, భార్యాపిల్లల నోళ్ళలో మట్టిని వేసే క్షిప్ర మార్గం ఇదని అందరూ దృఢంగా నమ్మారు. అయితే అయ్యింది దీనికి తద్విరుద్దంగా! మఠంలో ఎప్పుడూ ఎండుగడ్డిని, దద్దోజనంను తిని కృశించిన ఏనుగుకు అడవిలోని పచ్చిక, జొన్నపిండి, బెల్లం ముద్దలు, చెరుకు గడలు, అరటి గెలలు, చిలకడ దుంపలు (గెణసుగడ్డలు) వీటితో కృష్ణారెడ్డి దాన్ని భలేగా పెంచసాగాడు. ఏనుగు వృక్షాలను గుంజుకొని (లాక్కొని) తెచ్చిన బాడుగ కృష్ణారెడ్డికి మంచి లాభాల పంటనే కలిగించింది. కృష్ణారెడ్డి లాభాలలోని డబ్బుల మూటల
ముఖాన్ని చూసిందే ఏనుగు వచ్చిన పుణ్యాననే కదా!
అయితే ప్రతి వేసవి కాలంలో ఈ ఏనుగు నుంచి ఏదో ఒక రాద్ధాంతం గ్యారెంటీగా ఉండేది. ఏనుగు ఏమైనా తుంటరి పనులను చేస్తుందో లేక భగభగలాడే వేసవి వేడికి సహనాలను కోల్పోయిన జనాలలోని అసహనమో వీటితో కారణాలను నికరంగా చెప్పేది కష్టమేకదా!
ఏనుగొకసారి రహమాన్సాబ్ డబ్బా పెట్టె అంగడ్ని నెట్టి పడదోసిందని గలాటా అయ్యింది. జనం గుంపుగా చేరిందాన్ని చూసి స్కూటర్ను నిలిపేసి నేనూ ఆ గుంపు దగ్గరకు వెళ్ళా. గుంపుకు ప్రక్కనే ఏనుగు నిలిచియుంది. జనం రెహమాన్ చెప్పేదాన్ని వింటున్నారు. అరటి పండ్లను ఇవ్వలేదనే అక్కసుతో అంగడ్ని దొబ్బి పడేసిందట. దానికంతకూ కృష్ణారెడ్డే నష్టాన్ని కట్టాల్సిందే అని పెద్ద గొంతుతో అరుస్తూ పగిలిన సోడా బాటిల్స్ను, చెల్లాచెదురై పడిన బీడీ కట్టలను, అగ్గి పెట్టెలు, పిప్పర్మెంట్స్ను గుంపులోని జనానికి చూపిస్తున్నాడు. కొంతమంది ఏనుగును దూషించటం తప్పని తాగుబోతోడైన వేలాయుధంగాడి నిర్లక్ష్యమే దీనికి కారణమని తిట్టుతూ అతడికని గుంపు మధ్యలో వెతకసాగారు. కొంచంసేపు మాటలు నడిచిన మీదట ఎక్కడ్నుంచో వేలాయుధం వచ్చాడు. అపరాధిగా ముఖాన్ని పెట్టుకొన్న ఏనుగును మళయాళ భాషలో ఏమిటేమిటో తిట్టాడు. ఏనుగు ఏమి ప్రతిక్రియను చేయకనే చెవులను విసురుకొంటూ, తొండాన్ని ఆడిస్తూ అటుఇటు చూసింది. వేలాయుధం రెహమాన్ వైపుకు తిరిగి “ఏనుగు అరటి పండ్లకనే నీ అంగడ్ని పడేసింది అనేది శుద్ధ అబద్ధం. ఇక్కడంతా అరటి పళ్ళు సహజ స్థితిలోనే చెల్లాచెదురై పడియున్నవి కదా! ఒక పండునైనా ఏనుగు ముట్టిందా చూడు…. ఇంతకూ ప్రతిదినం అరటి పండ్లు ఇచ్చేదాన్ని అభ్యాసం చేసింది ఎవరు? నేనా….నువ్వా?” అని అరిచాడు. అక్కడున్నోళ్ళంతా ఏనుగు పరంగా కొంచం సానుభూతియున్నోళ్ళలాగ కనబడింది. వేలాయుధం వచ్చిన తర్వాత ఆ జగడం పరిష్కారమౌతదనేది నాకైతే కనబడలేదు.
“కావాలంటే ఈమెనే అడగండి. ఏనుగుకు నేనేమి చేసాను” అంటూ రెహమాన్ అక్కడే నిలిచిన జుబేదా వైపు చేతిని చూపించాడు. జుబేదా నా తోట పనులకు అప్పుడప్పుడు వస్తుండేది. రెహమాన్ ఆమెను ‘ఐ విట్నెస్‘ గా చెప్పినందున నేను “ఏమి జరిగిందో చెప్పమ్మా” అంటూ అడిగాను.
దురదృష్టవశాత్ ఆమె రెహమాన్ నిరీక్షించినదానికి వ్యతిరేకంగా “అనకూడని
రెండు మాటలను రెహమాన్ పలికాడు” అంది ప్రత్యక్షసాక్షి ఐన జుబేదా.
“ఏమని అన్నాడతను?” అని నేనెంతగా అడిగినా “అనకూడని మాటల్ని నేనెట్లా చెప్పేది?” అని ఆ మాటలను చెప్పనే లేదు జుబేదా. ఏనుగు మర్మానికి తాకేంతగా ఉన్న ఆ తిట్లు అవి ఏమిటనే కుతూహలంతో నేను రెహమాన్ను ఆ మాటలు ఏమిటని అడిగా. రెహమాన్ తనేమి అనలేదని ప్రతిఘటించుతూ జుబేదా మీద జగడానికి వెళ్ళాడు. జనమంతా “ఏనుగుకూ మానమర్యాదలు ఉంటవి…… తెలుసుకో మూర్ఖుడా” అంటూ రెహమాన్ మీద “ఛీ…ఛీ…నీ బతుకు చెడ” అంటూ ఉమ్మేస్తూ ఏనుగుకూ ఒక వ్యక్తిత్వం ఉంటదని అనుకోసాగారు.
3
వేసవిలో రెండోసారి రాద్ధాంతం నడిచింది మా తోటకు ఎక్కడ్నుంచో నాలుగు అడవి ఏనుగులు వచ్చినప్పుడు. మొదటగా నాకు గుర్తు అవలేదు. ఎందుకంటే అప్పటివరకూ నేను అడవి ఏనుగుల ఉపద్రవం ఏ తరహాగా ఉంటదనేది చూసిందే లేదు కదా !
ఇంట్లో కుళాయికని వేసిన పైపులలో నీళ్ళు వచ్చేది ఆగిపోయింది. ఇంటి ప్రక్కన కొండపై నుంచి వచ్చే జోము నీళ్ళకు (స్పటికమైన నీళ్ళకు) నేరుగా పైపులను వేసి నీళ్ళు ఇంట్లోకి ధారాళంగా వచ్చేదాన్ని చేసికొనియున్నాను. పైపుల లోపల అప్పుడప్పుడు కప్పలో, నీటి పాములో చొరబడి చిక్కుకుపోయి నీళ్ళువచ్చేందుకు అడ్డం పడుతుండేవి. అలాగే అయ్యుండొచ్చని భావిస్తూ, వేసిన పైపుల బారుకూ చూసుకొంటూ వెళ్ళాను. కొంచం దూరంలో పైపులను వేసేందుకు చేసిన దారి అంతటా గుంతలు పడి పైపులు ముక్కలు ముక్కలుగా గుంతల లోపలకు పూడ్చబడినవి. గుంతలలో నీళ్ళు నిండుగా చేరుకొని ఉన్నవి. తేవుడు తేవుడిగా ఉన్న నేలలో ఏనుగులు అడుగుల్ని కనుక వేస్తే చిన్న చిన్న బావులే నిర్మాణం అవుతవని, పైపులు ముక్కలు ముక్కలుగా విరిగి పాతాళంలోకి పూడ్చబడుతవని నాకు అప్పటివరకూ తెల్వదు. అందరూ ఏనుగుల దాడే ఇది అని చెప్పేవరకూ నా పైపులకు ఈ విధంగా నష్టాన్ని చేసింది ఎవరు అనేదే నేను యోచించుచున్నా.
ఈ ఏనుగుల మందనుంచి జనానికి ఏమి కష్టాలు అయినవో అనేది నాకైతే సరిగా గుర్తేలేదు. నాకంటూ నా పొలంలోని కంచె కొన్ని చోట్ల పాడైంది, పైపు వ్యవస్థ చిన్నాభిన్నం అయ్యింది తప్పితే హెచ్చుగా హాని ఏమి కాలేదు. అయినా అప్పుడప్పుడు
‘హళకొప్ప‘ దగ్గర ఎవరో సైకిలోడ్ని పరుగులు పెట్టించినట్లు, ‘బిదరళ్ళి‘ లో కాఫీ తోట లోపలికి చొరబడి పనులను చేస్తున్నోళ్ళను బెదిరించి కష్టాల్ని చేసినవి అనే వార్తలు వచ్చినవి. ‘మూడిగెరె‘కు పరిసర తజ్ఞుడు (ఇకాలజిస్ట్), స్నేహితుడు ఐన ప్రకాశ్ వచ్చేంతవరకూ అడవి ఏనుగుల దాడిని గురించి గొణుక్కొనే లెక్కలలోనే జనం నుంచి ప్రతిక్రియలు ఉండేవి.
ఎగువ భద్రా (అప్పర్ భద్రా) ఆనకట్ట వలన మునిగిపోయే అరణ్యాన్ని సర్వే చేసేందుకు వచ్చిన ప్రకాశ్ను, పరిసరం మీద ఒక ఉపన్యాసాన్ని ఇవ్వమని నేను అభ్యర్థించాను. అడవి ఏనుగులు ఊళ్ళవైపుకు వచ్చి రైతుల పైర్లు, పంటలకు హాని చేయటానికి కారణం ఏమిటంటే పారెస్ట్ డిపార్ట్మెంటోళ్ళు సహజ సిద్ధమైన అడవిలోని వృక్షాలను కొట్టేసి, వాటి స్థానంలో నీలగిరి, అకేశియా మొదలైన ఏనుగులకు నిరుపయుక్తమైన చెట్లను పెంచుతున్నందున ఈ ఉపద్రవాలు జరుగుతున్నవని సరైన ఉపన్యాసాన్ని ఇచ్చాడు. ప్రకాశ్ ఉపన్యాసంలో సహజమైన, నిజాయితితోయున్న మాటలు జనంమీద ప్రభావితమై ఒక పెద్ద ఆందోళనకు గురి చేసింది. గంధపు చెట్లను పెంచేందుకు ఆటంకాన్ని కలుగజేసేది, ఇళ్ళకని చెట్లను పొందే పర్మిట్లకు సతాయించేది, వేటకు అడ్డుపడేది….. మొదలైన పలుకారణాలచేత జనానికి అరణ్య ఇలాఖె (డిపార్ట్మెంట్) మీద కోపం ఎంతగానో ఉండేది. రైతుసంఘం వాళ్ళు చేసే పోరాటంలో అడవి దొంగలూ (స్మగ్లర్ల్లూ) చేరి పారెస్ట్ డిపార్ట్మెంటోళ్ళు పెంచుతున్న నీలగిరి మొక్కల నర్సరీని పాడుచేసి ఆఫీసు ముందే నల్లజెండాలను పట్టుకొని సత్యాగ్రహానికి కూర్చున్నారు. ఫారెస్టరైన నాగరాజు కృష్ణారెడ్డికి చెందిన ఆడ ఏనుగు మూలానే అడవి ఏనుగులు ఊర్లోకి వస్తున్నవని అనవసరంగా ఏనుగు మీద కంప్లైంట్ ఇచ్చాడు. అయితే జనం నాగరాజు మాటలకు వంత పాడకనే ఫారెస్ట్ డిపార్ట్మెంట్కు విరుద్ధంగా గలాటాను ముందుకే సాగించారు.
భద్రా అరణ్యంలో ప్రకాశ్తో జతగా నేను తిరుగుతుంటే ‘మూడిగెరె‘కే చెందిన కాడప్ప శెట్టిగారు ఒక క్రొత్త సమాచారాన్ని మాకు చేరవేసాడు. శెట్టిగారు వేలాయుధంతో జీపులో అడవి లోపల మాకు భేటి అయ్యి “కృష్ణారెడ్డి గారి ఏనుగు మీద అయ్యప్పస్వామి ఫోటో పెట్టి అంబారితో ఊరేగింపు చేస్తుండగా, ఆ ఏనుగుకు అప్పటికప్పుడే తల చెడి అంబారి సమేతంగా అడవిలోపలికి పారిపోయింది” అని చెప్పాడు.
ఊరేగింపు చేస్తున్నప్పుడు దాని వీపు మీదున్న అంబారి, దారి మధ్యలో తక్కువ ఎత్తులో ఉయ్యాలలాగ వేళ్ళాడుతున్న కరెంటు లైన్లకు (ఆ అంబారి) తాకి ఫటార్ అనే పటాకి మ్రోగినట్లుగా శబ్దాలురాగా, భయపడిన ఏనుగు వేలాయుధం మాటను వినకనే దారిని వదిలి పొలాలలోకి చొరబడి, ఆ తర్వాత అడవిలోకి పారిపోయిందట. ఏడెనిమిది వేల రూపాయల ఇత్తడి ఆభరణాలతో దానికి శృంగారాన్ని చేసారట. ఆ ఆభరణాలన్నింటిని కాడప్ప శెట్టే ఎక్కడ్నుంచో టెంపరరీగా తెచ్చినందుచేత, వాటిని దక్కించుకొనేందుకని అడవిలో ఆ ఆడ ఏనుగు కోసమని వెతుకులాడుతున్నాడట. “కృష్ణారెడ్డి గారి ఏనుగు ఇంత తుంటరి ఏనుగని తెల్వలేదు. గూళూరు మఠాధీశుడు ఏ ధైర్యంతో దీని మీద కూర్చుంటుండేవాడో” అంటూ అడవిలో ఏనుగును నోటికొచ్చినట్లుగా తిట్టాడు. ఏనుగు పరారై, అడవి ఏనుగులతో చేరుకొన్నదేమోనని ఊహిస్తూ అడవిలో వేలాయుధంతో చేరి వెతకసాగాడు. ఒంటినిండా అలంకరించుకొని వెన్నుమీద అంబారిని పెట్టుకొన్న ఈ ఏనుగును అడవి ఏనుగులు తమ గుంపులోకి చేర్చుకొంటవా అనే అనుమానం నాలో కలిగింది.
అది అడవిలోకి పారిపోయిన వైనాన్నే నెపంగా పెట్టుకొని, ఎదకొచ్చిన ఆడదైన ఏనుగుగా కావటం చేతనే అడవి ఏనుగులు ఊర్లోకి వచ్చి కష్టనష్టాల్ని ఇస్తున్నవని నాగరాజు చెప్పాడు. అయితే పోరాటగార్లు (రైతు సంఘపోళ్ళు) ఏనుగుకు కరెంట్ షాక్ అవ్వటం చేతనే అది పారిపోయిందని చెప్తూ అంత తక్కువ ఎత్తులో తీగల్ని వేసిన ఎలక్ట్రిక్ డిపార్ట్మెంటోళ్ళ మీద శాపనార్థాల్ని పెట్టారు.
అడవి ఏనుగుల ఆగమనంతో ప్రారంభమైన రాద్దాంతాలన్ని కృష్ణారెడ్డి గారి ఏనుగు పారిపోయినందున నిలిచిపోయినవి. వానాకాలం మొదలౌటంతో జనాల కోపతాపాలు చల్లబడినవి. వాళ్ళు గలాటాలను నిలిపేసి వ్యవసాయ పనుల మీద దృష్టిని నిలిపారు. ఏనుగు లేనందుచేత పనే లేని వేలాయుధం శివనాయుడుగారి సామిల్లో పనికి కుదురుకొన్నాడు.
జులైలోని జడివానలో ఒక రోజున కృష్ణారెడ్డి గారి ఏనుగు పోయిన విధంగానే మరలా ప్రత్యక్షమైంది. ఉదయం లేచి చూడగా ఖాళీగా ఉన్న కొట్టంలో కృష్ణారెడ్డి గారి ఏనుగు ‘నా మాన మర్యాదకు ఏమీ కాలేదు‘ అనేటట్లుగా తొండాన్ని ఆడిస్తూ నిలబడింది. మొదట్లో దాని దగ్గరకు వెళ్ళేందుకు జనం భయపడసాగారు. అది మునుపటి రీతిగానే అంగళ్ళన్నిటి దగ్గరకూ వెళ్ళి అరటి పండ్లను కోరుకొంటుండటంతో జనంలో నెమ్మదితనం కలిగింది. అయినా తనదే అయిన వైయక్తిక ఆశ, ఆకాంక్షలు దానిలో ఉన్నవేమోనని
జనం భావిస్తూ మొదట్లో ఉన్నట్లుగా దాని దగ్గరకు వచ్చి మసలుకోవటం లేదు.
4
నా వద్ద గొడ్డల్ని తీసుకొన్న దుర్గప్ప మూడు రోజులు గడిచిన మీదట, నేను పోస్టాఫీసు దగ్గరకు వెళ్ళగా, లైన్మ్యాన్ నారాయణతో తన వంటిని, చేతిని గోక్కుంటూ నిలబడియున్నదాన్ని చూచి…
“ఏమయ్యా దుర్గప్ప….. గొడ్డల్ని తీసుకొని ఎటు వెళ్ళావు? పత్తానే లేవు కదా?” అంటూ ప్రశ్నించాను.
“అందుకే స్వామి ఇక్కడ నించొని ఉంది”
“ఇక్కడ! ఇక్కడెందుకు నించొన్నావు?”
“కొమ్మల్ని సవరించి లైను క్లియర్గా చేయాలనుకొంటే పారెస్టోళ్ళు వచ్చి డిపార్ట్మెంట్కు చెందిన చెట్టును ఎందుకు నరుకుతున్నావు అంటూ గొడ్డల్ని లాక్కొన్నారు సార్. అడిగితే కోర్టులో కేసు వేసాము. కోర్టు నుంచే ఇప్పించుకో అని అంటున్నారు”.
“అరె! గొడ్డలి నాది కదా!”
“అలాగున చెప్తే వినాలికదా వాళ్ళు. నా డ్యూటీ నేను చేసాను అని అన్నా వినకుండానే జబర్దస్తు చేసి గొడ్డల్ని లాక్కొని ఆఫీసులో దాచారు సార్”
నా గొడ్డలి మీద నాకేమి వ్యామోహం లేదులే. అయినా న్యాయం ముఖ్యం కదా! ఇటువంటి నెత్తి నొప్పి కేసుల మూలాల్ని పట్టుకొని, విషయాల్ని తెలుసుకొనే కుతూహలం నాలో ఉంటది ఒక రచయితగా. నేను రాసిన ఎన్నో కతల మూలాలు ఇటువంటి తేలికైన గొడవలలోనే మునిగియున్నవిలే.
“నా గొడ్డల్ని వాళ్ళు ఏవిధంగా లాక్కొన్నారు. ఒక మాట అడుగుతాను రా” అంటూ దుర్గప్పను పిలుచుకొని నాగరాజు ఆఫీసుకు నడిచాను.
లోపల ఫారెస్టర్ నాగరాజు పోలీస్ ఇన్స్పెక్టర్ తరహాలో డ్రస్సు వేసుకొని ఫైళ్ళ గుట్టల ప్రక్కన కూర్చున్నాడు. యూనిఫాం వేసుకొన్న తక్షణమే మనిషి వ్యక్తిత్వంలో ఏవో మార్పులు అవుతవి అనేది ఈ నాగరాజు మూలాన కనబడుతుంది. విచిత్రమైన ఠీవితో నా వైపు చూసాడు.
“అవునండి నాగరాజుగారు…. మీ డిపార్ట్మెంటుకు చెందిన చెట్టును నరికితే మీరు అతడి మీద చర్యలు తీసుకోండి. అయితే నా గొడ్డల్ని ఆఫీసుకు తెచ్చుకొని ఎందుకు అట్టిపెట్టుకొన్నారు?” అని అడిగాను.
“కూర్చోండి” అంటూ తనకెదురులో ఉన్న కుర్చీని చూపిస్తూ నాగరాజు తన సన్నాయిని ఊదేందుకు పీపీని సరిచేసుకోసాగాడు.
“వెపన్సార్….వెపన్ (ఆయుధం) మాకు ముఖ్యం. ఏ విధమైన అపరాధాన్ని చేసినా దానికి సంబంధించిన ఆయుధం మాకు ఎంతో ముఖ్యం. కోర్టు వ్యవహారం మీకు తెల్వదన్నట్లుగా నాకు కనబడుతుంది. రేపు కోర్టులో అతను దేన్నుంచి చెట్టును నరికాడు అని అడుగుతారు. మడ్డుకత్తితోనో, గొడ్డలితోనో, రంపంతోనో దాన్ని (చెట్టును) వినాశనం చేసాడా? అని అడుగుతారు. అప్పుడు మేము జప్తుచేసిన ఈ వెపన్ను హాజరు పరచాలో కాదో మీరే చెప్పండి….? మీరెందుకు ఇటువంటి చట్ట వ్యతిరేక పనికి గొడ్డల్ని ఇచ్చారు? ఒక రీతిలో మీదీ తప్పు?”
“అదికాదండి…. లైనుమీద పడిన చెట్టును తీసేసేది చట్ట వ్యతిరేక పని అని మీ నోటినుంచే మొదటిసారిగా వింటున్నాను నా లైఫ్లో. మీ డిపార్ట్మెంట్కు చెందిన చెట్టు అతడి డిపార్ట్మెంట్కు చెందిన స్తంభం మీదపడితే అతను దాన్ని తొలగించాలా…. వద్దా మీరే చెప్పండి?” అన్నాను నేను.
“చూడండి సార్…. తెల్లగా ఉన్నదంతా పాలనే నమ్మేటోళ్ళు మీరు. ఇదంతా మీరు చెప్పినట్లుగా అంత సింపుల్గా ఉండదు సార్. మీరు అలాగునే అడుగుతున్నందు చేత విధిలేకనే చెపుతున్నాను. పి. డబ్ల్యు. డి. వాళ్ళు, కరెంటోళ్ళు, టెలిఫోన్ వాళ్ళు ఈ మూడు డిపార్ట్మెంటోళ్ళు మాకు ఎనిమి (శత్రువు) నంబర్వన్. వీళ్ళకు బుద్ధి నేర్పేది మాకు గుర్తే. రోడ్డుకు తారును వేసేటప్పుడు ఆ రోడ్డు ప్రక్కనున్న చెట్లను దారుణంగా కొట్టి తారును కాయించుకొంటారు పిడబ్ల్యుడి వాళ్ళు. కరెంటోళ్ళు, టెలిఫోనోళ్ళు వాళ్ళ లైనులను లాగేందుకని ఎక్కడంటే అక్కడ వేల ఎకరాల అడవిని నరికి పాడుచేస్తారు. ఇప్పుడు పల్లె పల్లెకూ కరెంట్, టెలిఫోన్ను ఇవ్వాలని సర్కారోళ్ళు పాలిసిని చేసుకొన్నందున, ఈ డిపార్ట్మెంటోళ్ళ రొట్టె జారి నేతిలో పడింది సార్. లైన్లను క్లియర్ చేసే నెపంతో వీళ్ళెవరూ తమ ఇళ్ళకని కట్టెల్ని కొనేది లేదు. మీరు చెప్పినట్లుగానే వీళ్ళూ గవర్నమెంట్ డిపార్ట్మెంటోళ్ళే. అయితే వీళ్ళు ఇలాగున తోక ఆడించేదాన్ని ఒప్పుకొంటే మా డిపార్ట్మెంట్ ద్వారాల్ని మూసుకోవాల్సివస్తది. వీళ్ళకు బుద్ధిని చెప్పాలో వద్దో మీరే చెప్పండి”
నాకు నాగరాజు కొంచం పరిచయం ఉన్నోడు. నా వెనుకనే నించొన్న దుర్గప్పను చూసే ఈ రీతిగా ఠేంకారంతో మాట్లాడుతున్నాడని ఊహించాను నేను. దుర్గప్ప చేసిన
పనిలో ఎంతటి దురుద్దేశం ఉందనేది నాకైతే కనబడలేదు. నాగరాజు అతడ్ని కోర్టుకు లాగి కేసు వేసేది అసంభవమే అనేది నాకన్పించింది. దుర్గప్పలో భయాన్ని పుట్టించేందుకనే ఇతను ఇలాగున చేస్తున్నాడని నేను ఊహించాను.
“అలాగైతే నా గొడ్డలికి తర్పణాన్ని వదిలేదే మంచిది” అని అన్నాను నేను.
“అదెందుకు తర్పణాన్ని వదుల్తారు? కేసును నడవనీయండి సార్. నాది తప్పో అతన్ది తప్పో తీర్పును కానీయండి” అన్నాడు నాగరాజు.
“అవునండి నాగరాజుగారు…. ఇవన్నీ ఎప్పటికైనా తీర్పులను చూసే కేసులేనా? మీరు వేరే డిపార్ట్మెంట్కు బుద్ధి నేర్పుతాను అని అన్నారు కదా! అలాగునే వాళ్ళూ మీకు బుద్ధి నేర్పాలని అనుకొంటున్నారు. నేర్చుకొనేందుకు ఎవరైనా తయారుగా ఉంటే కదా కేసు పరిష్కారం అవుతది” అన్నాను నేను.
నాగరాజు నోటి నుంచి “చూడండి సార్…. ఇప్పుడు గొడ్డల్ని ఇచ్చేది సాధ్యంకాదు. మా ఆఫీసు బయట నిలిచిన అంబాసిడర్ కార్లను చూసారా… అవన్నీ మీ గొడ్డలి తరహానే జప్తు చేసుకొని తెచ్చినవి. గంధం చెక్కల దొంగ రవాణాకని స్మగ్లర్లు వినియోగించిన కార్లు అవి. ఎక్కడినుంచో కార్లను దొంగిలించి, ఫారెస్ట్ సరుకునూ దొంగిలించి, రవాణా చేసేటప్పుడు మా దాడిలో చిక్కిన కార్లు అవి. ప్రస్తుతానికి మీ గొడ్డలి దొంగిలించబడినది కాదులే. ఆ కార్లను, కేసులు పరిష్కారం అయిన మీదట రిలీస్ చేస్తాము. వారసుదార్లు లేకపోతే వేలం వేస్తాము” అంటూ తను వశపరుచుకొన్న కార్లను గురించి చెప్పాడు.
మళెనాడులోని వానలకు కార్లన్నీ తుప్పుపట్టిపోయినవి. ఒక కారు చక్రం మీద పుట్టే పెరిగింది. ఇంకొక రెండిటి మీద ఏవో అడవి జాతికి చెందిన లతలు తీగలతో అలుముకొన్నవి. వాటి ప్రస్తుత శోచనీయమైన స్థితిని చూస్తుంటే అవి ఎప్పుడైనా రోడ్ల మీద పరిగెత్తినవి అని తలంచేదే సాధ్యం గావట్లేదు. వాటి మీదున్న కేసులు పరిష్కారం అయ్యేలోపు అవన్నీ తుక్కుగా స్క్రాప్ దుకాణం వాళ్ళకూ పనికొచ్చేటట్లుగా నాకు అన్పించటం లేదు.
“సరే నాగరాజు గారు…. నేను ఇంకొక గొడ్డల్ని ఖరీధించుకొంటానులే. నేను వచ్చింది ముఖ్యంగా మీరిద్దరూ సర్కారి డిపార్ట్మెంట్లకు చెందినా, ఒకరి మీద ఇంకొకరు కేసుల్ని వేసుకొనేదాన్ని సవివరంగా వినేందుకు వచ్చా. మీరు నిధానంగా కేసు పరిష్కారం
అయిన మీదటే, అందరికీ బుద్ధిని నేర్పించిన మీదటే గొడ్డల్ని ఇవ్వండి” అంటూ లేచాను.
నాగరాజుకు ఏమని అన్పించిదో ఏమో, దుర్గప్ప వైపుకు తిరిగి “ఏమిరా… చెట్టును ఎందుకు కొట్టావు అని అడిగితే, పైనున్న పెద్ద సార్లను అడగండి అనే బేజవాబ్దారి (నిర్లక్షపు) మాటలను మాట్లాడుతావా? చెప్పకనే, అడగకనే డిపార్ట్మెంట్ చెట్లను ఇంకొకసారి కొట్తే మరింకేమి లేదు నిన్నే లాకప్లోకి నెట్తా. ఏమని అనుకొంటున్నావు నన్ను” అంటూ గార్డ్ రామప్పను పిలిచి నా గొడ్డల్ని ఇచ్చేయండి అని ఆజ్ఞెను జారీ చేసాడు.
దుర్గప్ప మరలా చెట్టును తాను నరకలేదని కృష్ణారెడ్డి గారి ఏనుగే దాన్ని పడదోసిందని పాత పురాణాన్నే మరలా చెప్పాడు.
అతను చెప్పిందాన్నే మరలా మరలా చెబుతున్నందున, నాగరాజు రేగిపోయి “చెప్పిన దాన్నంతా రాతమూలకంగా రాసిస్తావా? అలాగైతేనే చెప్పు. దాన్ని (ఏనుగును) గుంజుకొచ్చి అంబాసిడర్ కారుకు జతగా కట్టేసి వాతల్ని వేస్తాను. నీ ఫిర్యాదు ఏమైనాఉంటే రాతమూలకంగానే ఉండాలి. అలాగుంటేనే నేను యాక్షన్ తీసుకొంటా” అంటూ గర్జించాడు.
దుర్గప్ప తను కంటితో చూడకనే ఎలాగున కంప్లైంట్ రాసిచ్చేదని గొణుక్కొంటూ గార్డ్ రామప్పతో స్టోరు దగ్గరకు వెళ్ళాడు. ఏనుగును కాన్ఫిస్కేట్ చేసి తెచ్చేది అంబాసిడర్ కారును తెచ్చినట్లుగా సులభమేమికాదని నాకు అన్పించింది.
5
ఆ ఏనుగు చేసే పనిని చూస్తే దాన్ని తెచ్చి కట్టేసి వాతల్ని వేద్దామనే నాగరాజు మాటల్ని నమ్మేందుకు ఎవరూ సిద్ధంగా లేరు. మా ఊర్లోని కలప వ్యాపారులు, సామిల్ వాళ్ళు ఆ ఏనుగుకు బాడుగను (కిరాయిని) ఇచ్చి పనులకని పిలుచుకొని వెళ్తుండేవాళ్ళు. ఏనుగుకు ఉన్న అపారశక్తి అది పనులను చేస్తున్నప్పుడు చూస్తే మాత్రం ఊహాకు చిక్కదన్నట్లుగా ఉంటది. వేలాయుధం వెనకనే తల వాల్చుకొని నడచి వెళ్తున్నప్పుడు చూస్తే మనకు దాని శక్తిమీద అందాజు చిక్కేదేలేదు. పెద్దపెద్ద మ్రానులకు తల నుదురును తాపించి అది ఒక్కసారిగా నెట్తే చాలు, వేర్లన్ని పటపట మంటూ నేలనుంచి మొదలుతో సహా పల్టాయించేవి. ఎంతో పెద్ద వృక్షాలైతే వాటి మొదలు భాగంలో మట్టిని తోడి
ప్రక్కనున్న వేర్లను కొట్టి ఏనుగుకు దాన్ని పడదోయమని చెప్తే, ఎంతటి వృక్షమైనా ఏనుగుకు ఉన్న రాక్షసశక్తి ఎదురులో చీత్కారాన్ని చేస్తూ నేలమీద పడిపోయేది.
ఏనుగు మ్రానులను పడదోసే విధానాన్ని చూస్తే, అడవిలో ఏనుగుల దాడి నుంచి తప్పించుకొనేందుకు చెట్లను ఎక్కేటోళ్ళు శుద్ధ మూర్ఖులే అనేది నా అభిప్రాయం. నిజంగా చంపాలని ఏనుగు మనస్సు చేసుకొంటే, చెట్టు మీదకు ఎక్కినోడ్ని చెట్టు సమేతంగా నేలకు పడదోసేది కచ్చితంగా దానికేమి కష్టమైన పని కాదులే. వెనుకటి కాలంలో రాజ మహారాజులు గజదళాన్ని పెట్టుకొనేవారు అని వినియున్నాము కదా! ఇప్పటి కాలంలోని యుద్ధంకు చెందిన ఫఠాం ట్యాంక్లన్నట్లుగా ఆ ఏనుగులు సైతం శత్రు సైన్యాల్ని ధ్వంసం చేసేవని నాకైతే కనబడుతుండేది.
బలభీముడన్నట్లుగా ఉండే ఈ ఏనుగు బక్కటోడైన నరమానవుడి రూపంలో నారాయణుడిగా ఉండే వేలాయుధం ఆజ్ఞెలకు తలొంచి అతను చెప్పినట్లే వింటుండేది మాత్రం నాకు భలే తమాషాగా కనబడుతుండేది. ‘మూడిగెరె‘ ప్రక్కన ప్రవహించే వాగుకు అడ్డంగా వారానికొకసారి పెద్ద బండలాగ ఏనుగు పడుకొనియుండేది. వేలాయుధం దాని వంటిమీదకు ఎక్కుతూ దిగుతూ కొబ్బరి పీచుతో గీకి గీకి (గోకి గోకి) స్నానాన్ని చేయించేవాడు. అయితే పైకి వచ్చిన తర్వాత దారిలో ఉన్న ధూళిని తొండంతో తీసుకొని ఒంటి మీద పౌడర్లాగ చిమ్ముకొనే ఈ ఏనుగుకు స్నానాన్ని ఎందుకు చేయించేవాడో? ఏనుగుకు ఎక్కువగా పని మీదపడినప్పుడు, దాన్కి రెండు లీటర్ల విప్పసారాయిని బహుమానంగా కృష్ణారెడ్డి గారు ఇస్తారని వేలాయుధం చెపుతుండేవాడు. వేలాయుధం ఆ ఇచ్చిన సారాయిలో ఎంత భాగాన్ని ఆ ఏనుగుకు త్రాపించేవాడో, తానెంతగా దాన్ని త్రాగేవాడో ఆ పెరుమాళ్ళ స్వామికే ఎరుక!
End of Preview.
Rest of the book can be read @
http://kinige.com/kbook.php?id=144