ఈనాటి తెలుగు పత్రికా పాఠకులకు సుపరిచితమయిన పేరు శైలజామిత్ర. సంగీత సాహిత్యాలలో ఉన్నత విద్యా అర్హతల్ని సాధించి, ఆయా రంగాలలో తనదైన ముద్రతో విశేష ప్రశంసల్ని పొందుతున్న విదుషీమణి ఆమె. అనువాద ప్రక్రియలలోనూ ఆరితేరిన చేయి అమెది. కవిత్వం, కధ నవల, సమీక్ష వంటి సాహిత్య ప్రక్రియల్లో ఇబ్బడి ముబ్బడిగా కృషి చేస్తూ చదవరులకి తన రచనా సాదు ఫలాలను అందిస్తున్నారు. ఉషోదయ వెలుగు పత్రికలో ‘మానవీయం’ అనే అంశంపై 48 సామాజిక వ్యాసాల్ని వెలువరించారు. భక్తి రంజనిలో ‘ఆధ్యాత్మికం-జీవితం’ శీర్షికన 54 వ్యాసాలు రాసారు. బాలసాహిత్యంలో ‘నేలపైని నక్షత్రాలు’ అనే నవల telugupoetry.com ద్వారా పాటకులకు అందించారు. శ్రీ వెంకటేశాయ నమహా: అనే మాసపత్రికలో పన్నెండు భక్తి గేయాలు రచించారు. ఇక బహుమతులు, అవార్డులు, సన్మాన సత్కారాలు అనేకం ఆమె ప్రతిభా స్వరాన్ని, ప్రజ్ఞా దురంధరత్వాన్ని వరించాయి. శైలజామిత్ర ఇదివరలో ఆరు కవితా సంపుటాలను, తరంగాలు పేరున ఒక కధా సంపుటి ప్రచురించారు. విస్త్రుత అధ్యయన శీలం ఆమె నిరంతర రచనా కృషికి ఎత్తిన జయపతాక.
శైలజామిత్ర రెండవ కధా సంపుటి ‘అడ్డా‘ ఆమె ‘అక్షరం నా ఆత్మాయుధం, సాహిత్యంతోనే నా సహచర్యం’ అనే లక్ష్య శుద్ధిని ముందుమాటగా కూర్చుకుని వచ్చింది కధానికా సంపుటి. పుస్తకంలో 20 కధలున్నాయి. అన్నీ ఇదివరలో వివిధ పత్రికల్లో ప్రచురింప బడినవే. వీటిలో కొన్ని బహుమతులు పొందిన కధానికలు.
సంపుటిలో ముందుగా చెప్పుకోవలసిన అంశం వస్తు వైవిధ్యం. వర్తమాన సామాజిక (దుః)స్థితికి ‘మనిషి’ బహిరంతర సంఘర్షణకి, దర్పణం పడుతూ అన్ని కధాంశాలు మనల్ని అంతర్ముఖీనం చేస్తాయి. ఆలోచన ప్రేరకంగా నిలుస్తాయి.
‘అడ్డా’ మీది కూలీల్లో పూట గడుపుకోవడానికి పడే యాతనల మధ్య మనిషి బలహీనతలుగా బయటకు వచ్చే ఈర్ష్యాసూయలు, ఎత్తుజిత్తులు తెరమీద కనబడుతూ ఉంటాయి.అయితే, వాటి వెనుక ఉన్న మానవీయ సహజాతులుగా దయ, పరోపకారం వంటి గొప్ప గుణాలు అవసరానికి ప్రచోదితాలై సహాయాన్ని సహకారాన్ని అందిస్తాయి. ‘అడ్డా’ లోని ఇతివృత్తం ఇదే. గుడిసెలు తగలబడుతుంటే ప్రాణాల్ని మాత్రం లెక్కచేయని తీరున గంగమ్మ పిల్లల్ని కాపాడింది బాలమ్మ. ఈ గంగమ్మే బాలమ్మను పక్కకు తోసి, తిట్టిపోసి ఆమె బదులు కులికి పోయిందా రోజు! స్థానీయత, దేశీయత, సహజత్వం, వాస్తవికత , కలిగిన మంచి కధ. భాష శైలి కూడా పానిపట్టు దగ్గరికి వెళ్ళటం వలన కధకొక శిల్ప గుణ వైశిస్త్యాన్ని కుర్చాయి.
భర్త ఇంట్లో నుంచి వెళ్ళిపోతే, దూరంలో ఎవరో వ్యక్తి చనిపోయినట్లు తెలిసాక ఆ వ్యక్తి తన భర్త ఏమో అనుకోని తల్లడిల్లి పోతుంది అంజలి. ఆయనగారు అప్పుల వాళ్ళ నుంచీ తప్పుకోవడానికి ఎటో వెళ్ళాడు! భార్య ప్రేమకు చలించి తన తప్పును గ్రహిస్తాడు భర్త. కధ పేరు ప్రేమాంజలి!
భార్యకు కూడా మనసుంది అని భావించే భర్తలు, కోడలు పరాయి వ్యక్తి కాదు కుటుంబంలో భాగం అని భావిన్చాగలిగే అత్తలు ఉంటే ఈ సమాజం ఇంతకంటే ఆనంద దాయకంగా ఉంటుంది కదానే సంవేదనకు అక్షర రూపం “సరికొత్త సూర్యోదయం” కధ. రచనా పరంగా ఇందులో మాధవి పాత్ర మనస్తాత్విక విశ్లేషణకు మంచి ఉదాహరణగా నిలిచింది.
కొన్ని వర్తమాన సమాజ ధోరణుల మీద ధర్మాగ్రహాన్ని ఎంతో నిశితంగా చూపారు శైలజామిత్ర. ముందు మాటలో వేదగిరి రాంబాబు గారు అన్నట్లు సమాజ ఉద్దరణ కోసం మనుషుల కన్నా ఆయుధాలే ముందు ముందు పనికి వస్ద్తాయని డైరెక్ట్గా సూచనా చేసారు. ఆ కధపేరు ” జాతర”
‘బతుకుమోపు’ కధానిక రైతు కష్టాల్ని కన్నీళ్ళనీ ఆర్ద్రంగా స్పృశించి రేపటి శుభోదయం పట్ల ఆశా భావాన్ని ప్రోది చేస్తుంది. డబ్బు వర్సెస్ మానవ సంబందాలు: భక్తి వర్సస్ మోసాలు వంటి అమానవీయ స్థితిగతుల పట్ల తమ భాధా తప్త హృదయానికి అక్షరీకరణం చేసారు రచయిత్రి. కధానిక పేరు “కాలగమనం”
‘అడ్డా’ కధా సంపుటి నిండా మనకు తెలిసిన పరిస్థితులున్నాయి. అవాంచనీయమైన మనస్తత్వాలున్నాయి. మనుషులున్నారు. సమాజంలోని అస్థవ్యస్థత ఉంది. మనుషుల్లోని ప్రవర్తనా సంకీర్ణత ఉంది. ‘ ఇది మంచిది కాదు’ అనే ప్రభోదించే దృశ్య కరణ౦ ఉంది. ‘ ఇది ఇలా ఉంటే మనం మరికొంత హాయిగా ఉండగలం అనే సూచనా చేస్తే ధైర్యాభివ్యక్తీకరణం ఉంది. చీకటిని ద్వేషిస్తూ చీకట్లోనే కుర్చుని బతుకులు తెల్లర్చుకునే బలహీనుల కంటే చీకటి కావాలి, గోరంత వెలుగును పట్టుకుని గట్టుకు చేరే ఆత్మ విశ్వాసం కలిగిన అభిమాన దనులు ఎక్కువగానే ఉన్నారు.
కధానికా నిర్మాణానికి ఒక ఖచ్చితమైన ఒరవడిని పెట్టుకున్నారు శైలజామిత్ర. ఆమె కధలన్నీ ప్రశ్నల్ని రేపుతూ మొదలవుతాయి. వాటి విశ్లేషణతో మొదలవుతాయి. వాటికి సంభావ్యతతో కూడిన సమాధానంతో ముగుస్తాయి. ఆ సమాధానం పరిష్కారం కాకపోవచ్చు. జీవితం అన్ని సందర్భాలలో వడ్డించిన విస్తరి కాదు కదా? ఈ తెలివి కలిగిన రచయిత్రిగా శైలజామిత్ర తన జ్ఞాన గంగని మనకు అందించారు.
కధా శిల్ప పరంగా ‘అడ్డా’లో కధలన్నీ చదివించే గుణంతో మెరుపు లీనుతున్నాయి. కొన్ని వ్యాస కధల్లా ఉన్నా, లేక కధా వ్యాసాల్లా ఉన్నా వస్తైక్యతని కోల్పోని గుణం వాటిని మంచి కధలుగా నిలుపుతోంది. శైలజా మిత్ర ప్రతి కధ పాటకుని హృదయాన్ని ఆత్మీయంగా ఆర్ద్రంగా పలకరిస్తుంది. అదే ఆమె రచనా విజయం.
‘అడ్డా’ని కొని చదివి ఆనందించండి
– సమీక్షకులు: విహారి
* * *
“అడ్డా” డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది. వివరాలకు ఈ క్రింది లింక్ని అనుసరించండి.
అడ్డా On Kinige

Related Posts: